Tirupati Laddu: తిరుమల వెంకన్న లడ్డూకి పెరుగుతున్న డిమాండ్.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..!

Tirupati Laddu: తిరుమల తిరుపతి వెంకన్న స్వామి వారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.

Update: 2024-09-14 11:57 GMT

Tirupati Laddu

Tirupati Laddu: తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం అందరికి గుర్తు వచ్చేది లడ్డూ ప్రసాదమే. తిరుమలకు వెళ్లి తిరిగి వచ్చిన వారిని లడ్డూ ప్రసాదం ఎక్కడా..? అంటూ సహోద్యోగులు అడుగుతూనే ఉంటారు. అంటే తిరుమల లడ్డూ ప్రసాదానికి డిమాండ్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. లడ్డూను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ.. బయట ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు దళారులు. ఈ బ్లాక్ మార్కెట్‌కు చెక్ పెట్టేలా టీటీడీ తెచ్చిన ఫార్ములా సూపర్ సక్సెస్ అయింది. భక్తుల వద్ద నుంచి విశేష స్పందన వస్తోంది.

శ్రీ వెంకటేశ్వరుడి పవిత్ర ప్రసాదం లడ్డూకు ఉన్న డిమాండే వేరు. దేశవిదేశాలలో సైతం స్వామి వారి లడ్డూకు విశేష ఆదరణ ఉంది. దీంతో బయట ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్‌లో లడ్డూలు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు టీటీడీ దృష్టికి రావడంతో దళారులకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టింది. తిరుమల నుంచే దళారీ వ్యవస్థను అరికట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.

లడ్డూ కాంప్లెక్స్‌లో దర్శనం టిక్కెట్.. టోకెన్ సమర్పిస్తే చాలు కోరినన్ని లడ్డూలు ఇచ్చేలా మార్పులు తెచ్చారు. దర్శనానికి వెళ్లకుండా కేవలం లడ్డూలను కొనదలిచ్చిన భక్తులకు నిబంధనలు అమలు చేసింది టీటీడీ..దర్శనానికి వెళ్లని భక్తుడు కచ్చితంగా ఆధార్ కార్డు చూపించాలి. ఒక్క ఆధార్ కార్డుపై రోజువారీ రెండు లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. తద్వారా దళారులకు పూర్తి స్థాయిలో టీటీడీ చెక్ పెట్టినట్లు అయింది.

శ్రీవారి ప్రసాదం భక్తులకు చేరువ చేసేలా టీటీడీ చర్యలు చేపట్టింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ, టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు ఉన్న హైదరాబాదు, చెన్నయ్, బెంగళూరు, వైజాగ్, విజయవాడ, వెల్లూరులలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో లడ్డూలకు డిమాండ్ ఉంది.

కొన్నేళ్లుగా పంపలేక పోయిన టీటీడీ... తాజా నిర్ణయంతో వారం రోజుల వ్యవధిలోనే దాదాపు లక్షకు పైగా లడ్డూలు సరఫరా చేసింది. దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీటీడీ. ఈ నిర్ణయం ద్వారా బ్లాక్ మార్కెట్ అరికట్టనుంది. ప్రస్తుతం బయట ప్రాంతాల్లో టీటీడీ కేవలం మొబైల్ నంబర్ ఆధారంగా ఒక్కో మొబైల్ నంబర్‌పై రెండు లడ్డూలను కేటాయిస్తున్నట్లు సమాచారం.

అయితే తిరుమల తరహాలో ఇతర ప్రాంతాల్లో విక్రయించే లడ్డూ ప్రసాదాలకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని టీటీడీ యోచిస్తోంది. తిరుమల తరహాలో ఒక్క ఆధార్ కార్డుపై రెండు లడ్డూలను 100 రూపాయలకు విక్రయించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఒకటి, రెండు రోజులు ప్రయాణించే ప్రాంతాలకు ఇప్పటికే టీటీడీ లడ్డూ సరఫరా ప్రారంభించింది.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న శ్రీవారి భక్తులకు విరివిరిగా లడ్డూలు అందేలా టీటీడీ చర్యలు చేపట్టింది.ఈ విధానంపై శ్రీవారి భక్తులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శించుకుని లడ్డూ ప్రసాదం పొందితే ఆ తృప్తి వేరని, అలాంటిది బయట ప్రాంతాల్లో లడ్డూ ప్రసాదం అందించడంపై టీటీడీ మరోసారి ఆలోచించాలని భక్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News