Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు

* పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు * స్టోర్‌ మేనేజర్‌తో పాటు ఇద్దరు యువకుల అరెస్ట్

Update: 2021-11-06 12:16 GMT

జూబ్లీహిల్స్‌ హెచ్అండ్ఎం వస్త్ర దుకాణంలో ఘటన(ఫైల్ ఫోటో)

Hyderabad: టెక్నాలజీ పెరుగుతోందని ఆనంద పడాలో లేక ఇబ్బందులు కొని తెస్తోందని బాధ పడాలో అర్థం కాని పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయి. మొబైల్‌ ఫోన్ల వాడకం పెరుగుతున్న కొద్దీ దారుణాలు కూడా అదే రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. మనుషులకు భద్రత కొరవడింది. ముఖ్యంగా మహిళలు ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ఫేస్‌ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో అమ్మాయిల ప‌ట్ల జ‌రుగుతున్న ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. మ‌రీ ముఖ్యంగా ఆక‌తాయిలు చేస్తున్న ప‌నుల‌కు అమ్మాయిల జీవితాలు స‌ర్వ నాశనం అవుతున్నాయి. కొంద‌రు అమ్మాయిల‌కు తెలియ‌కుండా సీక్రెట్ కెమెరాల‌ను వారి బాత్రూమ్‌లలో లేదంటే ప‌బ్లిక్ టాయిలెట్లలో అమ‌ర్చి వారి జీవితాల‌తో ఆటలాడుకుంటున్నారు.

నగ్న ఫొటోలు మొబైళ్లలో తీసి, సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఘటన మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. జూబ్లీహిల్స్‌లోని హెచ్ అండ్ ఎం బట్టల దుకాణంలో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయిల్ రూమ్ లో నుంచి మొబైల్ ఫోన్ ద్వారా ఆమె నగ్న ఫోటోలను చిత్రీకరించారు ఇద్దరు యువకులు.

ఆ పోకిరీలను పసిగట్టిన యువతి ఆ ఇద్దరితో పాటు స్టోర్‌ మేనేజర్‌పై కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు యువకులతో పాటు స్టోర్‌ మేనేజర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సెల్‌ఫోన్లలోంచి ఫొటోలను తీయించి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన కొత్తేమీకాదు. కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. వాష్‌రూమ్‌లో ఎవరికీ అనుమానం రాకుండా సీసీ కెమెరాను ఏర్పాటు చేసి, యువతుల చిత్రాలను రికార్డు చేసిన కేసులో అప్పట్లో కొందరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది మరువక ముందే మరో ఘటన వెలుగులోకి రావడంతో నగరంలోని యువతులు, మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ అనే కాదు అసలు బయటకు పోవాలంటేనే జంకుతున్నారు. 

Tags:    

Similar News