N Convention Centre: ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కి ఎలాంటి స్టే లేదు.. రంగనాథ్ సంచలన విషయాలు వెల్లడి

Update: 2024-08-24 11:18 GMT

N Convention Centre: ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ కూల్చివేత వివాదం కోర్టుకెక్కిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తాజాగా ఈ అంశంపై స్పందించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కి కోర్టు నుండి గతంలో ఎలాంటి స్టే లేదని రంగనాథ్ స్పష్టంచేశారు. రంగనాథ్ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇంకొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. అవేంటంటే..

ఇవాళ మాదాపూర్ సమీపంలోని ఖానామెట్ పరిధిలో ఉన్న తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించడం జరిగింది. అలా కూల్చేసిన ఎన్నో అక్రమ కట్టడాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఒకటి.

తమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్‌కు సంబంధించి హెచ్ఎండిఏ 2014 లోనే ప్రిలిమినరి నోటిఫికేషన్ జారీచేసింది. 2016 లో పూర్తి వివరాలతో తుది నోటిఫికేషన్ విడుదల చేసింది.

2014 లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అవడంతోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ యాజమాన్యం తెలంగాణ హై కోర్టును ఆశ్రయించింది. అయితే, ఎఫ్‌టిఎల్ గుర్తింపు విషయంలో చట్టపరమైన పద్ధతుల్లోనే వెళ్లాల్సిందిగా అప్పట్లో కోర్టు సూచించింది. దాంతో పిటిషనర్ అయిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ యాజమాన్యం సమక్షంలోనే ఒక సర్వే నిర్వహించి ఆ రిపోర్టుని వారికి అందజేయడం జరిగింది. ఆ తరువాత అదే సర్వే రిపోర్టుపై 2017 లో మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది కానీ ఏ కోర్టు నుండి ఎలాంటి స్టే ఆర్డర్ రాలేదు అని రంగనాథ్ తేల్చిచెప్పారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ అక్రమ పద్ధతిలో నిర్మించిన నిర్మాణాల్లో వ్యాపారం కొనసాగిస్తోంది. ఎఫ్ టిఎల్ పరిధిలో 1 ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు స్థలాన్ని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టింది అని రంగనాథ్ మరోసారి స్పష్టంచేశారు.

కబ్జా చేసిన స్థలంలో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతి మంజూరు చేయలేదు.

అక్రమ పద్ధతిలో నిర్మించిన నిర్మాణాలను బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ( BRS Scheme ) పద్ధతిలో సక్రమం చేసుకునేందుకు ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ యాజమాన్యం ప్రయత్నించింది. కానీ వారి దరఖాస్తుని సంబంధిత అధికారులు తిరస్కరించారు.

తమ్మిడికుంట చెరువుతో పాటు ఆ చుట్టుపక్కల చెరువును అనుసంధానం చేస్తూ ఉన్న నాలాలు కబ్జాలకు గురయ్యాయి. ఆ కబ్జాలను పట్టించుకోకపోవడం వల్ల భారీ వర్షాలు కురిసినప్పుడు మాదాపూర్, హైటెక్స్ ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు సగం మునుగుతున్నాయి. చెరువు విస్తీర్ణం మొదట ఉన్నదానికి, ఇప్పటికీ 50-60 శాతానికి తగ్గింది. దీంతో అక్కడ నివాసం ఉంటున్న వారికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లుతోంది అని రంగనాథ్ తన ప్రెస్ రిలీజ్ ద్వారా అక్కడి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ ఎఫ్ టిఎల్ / బఫర్ జోన్ లో నిర్మించారు. ఈ నిర్మాణనికి ఎలాంటి అనుమతులు లేవు.

అన్ని అంశాలు ధృవీకరించుకున్న తరువాతే హైడ్రా అధికారులు, నీటి పారుదల శాఖ, టౌన్ ప్లానింగ్, రెవిన్యూ శాఖల అధికారులతో కలిసి వెళ్లి కూలగొట్టడం జరిగింది.

ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ హై కోర్టు మధ్యంతర స్టే ఇవ్వడం జరిగింది అని రంగనాథ్ తన ప్రెస్ రిలీజ్ ద్వారా స్పష్టంచేశారు.

Tags:    

Similar News