అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రా.. ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్న ప్రభుత్వం..

అక్రమణ దారులకు హడల్‌ పుట్టిస్తున్న హైడ్రా

Update: 2024-09-12 08:00 GMT

హైడ్రా యాక్షన్ ట్రిపుల్ ఆర్ వరకు..

HYDRAA: చెరువులను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం హైడ్రా తో హడల్ పుట్టిస్తోంది. ఓఆర్ఆర్ పరిధి వరకు ఉన్న హైడ్రా చెరువు శిఖం భూములు ఆక్రమించిన వారిపై ఉక్కు పాదం మోపుతుంది. ఓఆర్ఆర్ అవతల రీజనల్ రింగ్ రోడ్ లోపల ఫ్యూచర్ సిటి నిర్మాణానికి పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ వరకు హైడ్రా పరిధి పెంచి చెరువుల సంరక్షణకు చర్యలకు శ్రీకారం చుట్టనుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో హైడ్రా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించి నిరంతరం నిఘాతో ముందస్తు చర్యలకు దిగుతుందనే టాక్ వినిపిస్తోంది.

హైడ్రాను రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు హైడ్రా విస్తరిత ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ లోపలి వరకు మాత్రమే ఉన్నది. అయితే, హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమ నిర్మాణాదారుల చిట్టా బయటపడటం, చెరువుల్లోకి వచ్చే నిర్మాణాలను తొలగించడం, చెరువుల్లో నిర్మాణాలంటే భయపడే పరిస్థితి ఇటు నిర్మాణాదారుల్లోనూ, అటు కొనుగోలు దారుల్లోనూ వచ్చిందనేది ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి..గ్రేటర్ పరిధిలో ఇక ముందు చెరువుల్లోకి నిర్మాణాలు వస్తే ఎప్పటికైనా ప్రమాదమనేది ప్రజల్లో ఏర్పడిందనీ, ఇక ముందు ఔటర్ వెలుపల కూడా చెరువుల ను పరిరక్షించాలంటే హైడ్రా అక్కడ వరకు ఉండాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నట్టు హైడ్రా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రజల్లోనూ మార్పు వస్తుందనీ, నీటి వనరులు ఉన్న చోట ఇండ్లు కొనుగోలు చేయాలంటే ముందుగా అన్ని అనుమతులు ఉన్నాయా? లేవా? ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోకి వస్తాయా.? అనేది కూడా సమగ్రంగా సమాచారం సేకరించిన అనంతరమే కొనుగోలు చేసే పరిస్దితులు నెలకొన్నాయి. దీని వెనుక హైడ్రా చర్యలే కీలకపాత్ర పోషించాయని ప్రభుత్వం భావించి రీజినల్ రింగ్ రోడ్ వరకు హైడ్రాను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. హైడ్రా రంగ ప్రవేశంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులపై ప్రజల్లో పెనుమార్పు వచ్చిందనీ, ఈ నేపథ్యంలోనే హైడ్రాను రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఔటర్ వెలుపల ఉన్న చెరువులను కాపాడే దశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

ఓఆర్‌ఆర్ పొడవు 158 కిలోమీటర్లుగా ఉంటే రీజినల్ రింగ్ రోడ్ పొడవు 350 కిలోమీటర్లుగా ఉన్నది..ఔటర్ లోపల వైపు 455 చెరువులు ఉన్నాయి. వీటిల్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు సంచలనంగా మారాయి. ఇంకా చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉన్నది. ఇప్పట్లో గ్రేటర్ పరిధిలోని చెరువుల వైపు అక్రమార్కులు తొంగిచూసే పరిస్థితి లేదనేది స్పష్టమవుతున్నదని ప్రభుత్వ భావిస్తుంది. ఔటర్ వెలపల 2వేల 402 చెరువులు ఉన్నాయి. వీటిపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టేందుకు హైడ్రాను విస్తరించాలని నిర్ణయించింది. దీంతో హైడ్రా పరిధిలోకి మొత్తం 2 వేల 852 చెరువులు రానున్నాయి.

ఈ చెరువుల్లోకి నిర్మాణాలు రాకుండా చేస్తే చాలు వాటిని కాపాడినట్టేననేది అధికార వర్గాల్లోని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హైడ్రాను విస్తరిండం వల్ల చెరువుల ఉనికిని కాపాడాలని ప్రభుత్వం భావిస్తుందని అధికారులు చెబుతున్నారు. 2852 చెరువుల చర్యలపై ఇప్పుడే దృష్టిసారిస్తే రానున్న రోజుల్లో కబ్జాలు మరింత తగ్గుముఖం పడుతాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనికి తోడు చెరువుల్లోకి వచ్చి చేరుతున్న మురుగునీటిని కూడా ఆరికట్టనుంది. పెద్దల విలాసాలకు పేదలు బలి అవుతున్నారు. తాగునీటి జలాశయాల్లోకి మురుగు నీటిని వదులుతున్నారు. వాటిని నిరోధించకుంటే నేను ముఖ్యమంత్రి గా ఉండి ఫలితమేంటని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు చెరబట్టిన వారు ఇక చెరసాలకే అంటూ హైడ్రాకు పూర్తి మద్దతు తెలుపుతూ ఆక్రమణదారులకు వార్నింగ్ ఇచ్చారు సిఎం.

భూవినియోగం పెరగడం, భూములకు విపరీతంగా డిమాండ్ రావడంతో అక్రమార్కులు చెరువులను చెరబడుతున్నారేది బహిరంగ రహాస్యం. పాత తేదీల్లో, గ్రామపంచాయితీల నుంచి భవన నిర్మాణ అనుమతులు తీసుకుని యదేచ్చగా చెరువుల్లోకి చొచ్చుకుని వస్తూ నిర్మాణాలు సాగిస్తున్న విషయం హైడ్రా తో వెలుగులోకి వచ్చింది. ఈ తరహాలోనే పాత తేదీల్లోని అనుమతులతో చెరువుల్లో నిర్మాణలు చేపట్టాలంటేనే జంకాల్సిన పరిస్థితులను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పరిధిని విస్తరించాలని ప్లాన్‌ చేస్తుంది.

ప్రస్తుతం ఔటర్ వెలుపల 2వేల 402 చెరువులు ఉన్నాయి. వీటిల్లోకి నిర్మాణాలు లేఅవుట్లు రాకుండా చేయాలంటే హైడ్రాను విస్తరించాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.ట్రై సిటీస్ అయిన హైదరాబాద్,సికింద్రాబాద్,సైబరాబాద్ పరిధిలో నాళాలు,చెరువులు కబ్జాలు గురయ్యానని,ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీకి ఈ ఇబ్బందులు ఉండొద్దని ముందస్తు ప్రణాళికలతో వెళ్తుందని తెలుస్తోంది.

Tags:    

Similar News