IPL 2025: కొత్త ఫ్రాంచైజీలను నడిపించనున్న టీమిండియా కుర్రాళ్లు.. ఈ ఐదుగురిలో హిట్ అయ్యేది ఎవరు?
IPL 2025 ప్రారంభానికి ముందు రిషబ్ పంత్, అయ్యర్, రహానే, రజత్ పటిదార్, అక్షర్ పటేల్లో ఎవరు హిట్ అవుతారన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

IPL 2025: ఐపీఎల్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్కు పండగ. ఈ ఏడాది ఆ ఫెస్టివల్ కాస్త గ్రాండ్గానే జరిగేలా ఉంది. ఎందుకంటే కొత్త కెప్టెన్లు వచ్చేశారు! గతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని లాంటి లెజెండ్స్ కెప్టెన్సీని ఇంతకాలం చూసిన ఫ్యాన్స్కు ఈ ఏడాది ఐదుగురు కొత్త కెప్టెన్లను చూడనున్నారు. ఈ ఐదుగురు కెప్టెన్లు ఎవరు? ఏంటి అన్నది ఓసారి చూద్దాం!
రిషబ్ పంత్:
ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన రిషబ్ పంత్, ఈసారి కొత్త జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. లక్నో టీమ్ యాజమాన్యం గతేడాది KL రాహుల్ కెప్టెన్సీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం టీమ్ కోసం ఆడే వాళ్లే తమకు అవసరమని రాహుల్కు కౌంటర్ ఇస్తూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు అలాంటి జట్టుకు పంత్ నాయకత్వం వహించాల్సి ఉంది. నెట్స్లో చలాకీగా నవ్వుతూ ఉండే పంత్.. డ్రెస్సింగ్ రూమ్ ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
అక్షర్ పటేల్:
ఇటు అక్షర్ పటేల్ ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్కు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈసారి ఏకంగా కెప్టెన్గా ప్రమోషన్ కొట్టేశాడు. నిజానికి అక్షర్ గొప్ప టీమ్ ప్లేయర్.. అయితే కెప్టెన్సీలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడో అన్నది ఆసక్తిగా మారింది.
రహానే:
ఇక ఒకప్పుడు భారత జట్టు ప్రధాన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రహానే.. ఆ తర్వాత క్రమంగా జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. గత ఐపీఎల్ వేలంలో కూడా ఎవరూ అతడిని కొనడానికి ఆసక్తి చూపలేదు. కానీ, కేకేఆర్ చివరి నిమిషంలో రహానేను టీమ్లోకి తీసుకుంది. అంతటితో ఆగలేదు.. ఏకంగా రహానేకి కెప్టెన్సీ కూడా ఇచ్చేశారు. ఇది రహానేకు కెరీర్లో మరో మంచి అవకాశమనే చెప్పాలి.
అయ్యర్ మెరిసేనా?
కోల్కతా నైట్ రైడర్స్ శ్రేయాస్ అయ్యర్ను రిటైన్ చేసుకోక పోవడం ఫాన్స్కు షాకే. సాధారణంగా ఓ మంచి కెప్టెన్ను జట్టు వదులుకోవడం అరుదు. కానీ KKR అతడిని రిలీజ్ చేసింది. వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇక శ్రేయస్కు ఇది కొత్త టీమ్.. మరో కొత్త పరీక్ష. మరి గతేడాది లాగే శ్రేయస్ అద్భుతాలు చేస్తాడో లేదా చూడాలి.. అందులోనూ కుర్రాడు మంచి ఫామ్లో ఉన్నాడు!
రజత్ పటిదార్
ఇక అన్నిటికంటే ఎక్కువగా RCB కెప్టెన్ గురించి చర్చ జరుగుతోంది. ఏ మాత్రం అనుభవంలేని రజత్ పటిదార్కు కెప్టెన్సీ ఇచ్చారు. నిజానికి ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం తర్వాత విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆర్సీబీ మాత్రం రజత్ పటీదార్ సెలక్ట్ చేసింది. మరి పటిదార్ ఎలా జట్టును నడిపిస్తాడోననే ఉత్కంఠ కేవలం ఆర్సీబీ ఫ్యాన్స్లనే కాదు.. అందరిలోనూ కనిపిస్తోంది!