IPL: చెన్నై కాదు.. ఆర్సీబీ అంతకన్నా కాదు... ఐపీఎల్లో ఈ జట్టే అత్యంత విలువైన జట్టు!
ఐపీఎల్లో అత్యంత విలువైన జట్టు ఏది? ఐపీఎల్ చూసే అభిమానుల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు?

IPL: చెన్నై కాదు.. ఆర్సీబీ అంతకన్నా కాదు... ఐపీఎల్లో ఈ జట్టే అత్యంత విలువైన జట్టు!
IPL: ఒకప్పుడు వేసవి సెలవుల్లో చుట్టాలింటికో, లేదా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్లడం కామన్గా అనిపించేది. కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత రాత్రివేళ టీవీల ముందు కూర్చొని మ్యాచ్ చూడడం కుటుంబ సంబరంగా మారిపోయింది. క్రికెట్ అంటే కేవలం కుర్రాళ్లు మాత్రమే చూసే ఆట అనుకునే రోజులు పోయాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు, ఇలా అందరికీ ఆత్రుత కలిగించే పాన్-ఇండియా ఈవెంట్గా ఐపీఎల్ రూపాంతరం చెందింది. ఈ టోర్నమెంట్ ఇప్పుడు 18వ సీజన్కి అడుగుపెడుతోంది. చాలా తక్కువ సమయంలోనే ఇది NFL, UEFA ఛాంపియన్స్ లీగ్ వంటి ప్రపంచస్థాయి లీగ్లతో పోటీ పడే స్థాయికి ఎదిగింది.
ఒకప్పుడు క్రికెట్, ముఖ్యంగా ఐపీఎల్, మగాళ్లే ఎక్కువగా ఆసక్తిగా చూసే ఆట అని భావించేవారు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని లాంటి స్టార్ ప్లేయర్ల ప్రభావంతో మహిళలూ ఈ లీగ్ను ఆసక్తిగా చూడటం మొదలు పెట్టారు. టెస్ట్, వన్డేలు పెద్దగా చూడకపోయినా, ఐపీఎల్ కోసం మాత్రం బాగా క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా జరిగిన ఒక సర్వే ప్రకారం, ఐపీఎల్ చూసే అభిమానుల్లో 43శాతం మంది మహిళలు ఉన్నారు. అంతేకాదు, భారత మహిళల క్రికెట్ జట్టు పెరుగుతున్న ప్రాచుర్యం, WPL ప్రారంభం వంటి పరిణామాలు ఇందుకు మరింత దోహదపడ్డాయి.
క్రికెట్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ ఐపీఎల్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇది ఇప్పటికీ ఎక్కువగా ఇండియాలోనే ఫేమస్. అమెరికా లాంటి దేశాల్లో క్రికెట్కు పాపులారిటీ తక్కువే. అక్కడ ఆటను ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నా, పెద్దగా ఫలితం రావడం లేదు. అయినప్పటికీ, ఐపీఎల్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ లీగ్ విలువ అక్షరాలా 50 లక్షల కోట్లు! ఐపీఎల్లో అత్యంత విలువైన జట్టు ఎంటిదో చెప్పడం కష్టం కాదు. మీలో చాలా మంది ఊహించినట్లుగానే, ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్లో ఉంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని ఏలుతున్న అంబానీ, క్రికెట్లో కూడా తనదైన ముద్ర వేశారు. ముంబై ఇండియన్స్ను అత్యంత విలువైన ఫ్రాంచైజీగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆ జట్టు విలువ అక్షరాలా 1.5 లక్షల కోట్లు. చెన్నై సూపర్ కింగ్స్ ముంబైకి పోటీగా ఉన్నా, వ్యాపార పరంగా చూస్తే ఇంకా వెనుకబడి ఉంది.