నిప్పుల కొలిమిలా ఉత్తర భారత్‌.. భానుడి భగభగలకు పిట్టల్లా రాలుతున్న జనం

నాగ్‌పూర్‌లో 56 డిగ్రీల రికార్డుస్థాయి ఉష్ణోగ్రత

Update: 2024-06-01 04:19 GMT

నిప్పుల కొలిమిలా ఉత్తర భారత్‌.. భానుడి భగభగలకు పిట్టల్లా రాలుతున్న జనం 

ఉత్తర భారతంలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. గత నాలుగు రోజులుగా నిప్పుల వాన కురిపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతల పెరుగుదలతో అసాధారణ పరిస్థితులు నెలకున్నాయి. నైరుతి రుతుపవనాలు మొదలైనా ఎండలు ఏ మాత్రం తగ్గకపోగా.. రోజురోజుకు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాల్లో అధిక ఎండలు, వేడి తీవ్రతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.

మహారాష్ట్ర, నాగ్‌పూర్ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నాగ్‌ఫూర్‌లో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఎండలు తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. రాబొయే నాలుగు రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన నుంచి అతి తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని వాతవారణ శాఖ అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, యూపీ, బిహార్ వంటి పలు రాష్ట్రాల్లో వేడి గాలులు, వాతావరణ పరిస్థితి కారణంగా మరణాలు పెద్ద సంఖ్యలో నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా పలు రాష్ట్రాలు వేసవి సెలవులను పొడిగించే అవకాశం ఉంది.

Tags:    

Similar News