కేంద్రంలో మంత్రులయ్యేది ఎవరు? ఇద్దరు లేదా ముగ్గురికి చాన్స్...
మోదీ తన క్యాబినెట్లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు?
BJP MPs: రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్లో ఎవరెవరికి బెర్త్ లభించనుంది? మోదీ తన క్యాబినెట్లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన దృష్ట్యా, కేంద్ర క్యాబినెట్ కూర్పునకు సంబంధించి తెలంగాణ కోటాపై ఎలాంటి ప్రభావం పడనుంది? వంటి ప్రశ్నలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఒక క్యాబినెట్ మంత్రి పదవితో పాటు ఒకటి లేదా రెండు సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవులకు సంబంధించి కిషన్రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పేర్లు పరిశీలించవచ్చని ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్రెడ్డికి ఈసారి కేంద్ర క్యాబినెట్లో కీలకశాఖ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు.. బండి సంజయ్, డీకే అరుణ, ఈటలల్లో ఒకరికి లేదా ఇద్దరికి సహాయ మంత్రులుగా అవకాశం లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అగ్రనాయకత్వం కేంద్ర క్యాబినెట్ పదవుల కేటాయింపు, రాష్ట్ర చీఫ్ బాధ్యతలపై నిర్ణయం తీసుకుంటున్నట్టు శ్రేణుల్లో టాక్ నడుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ, లోక్సభలో కీలకంగా పనిచేసిన మరో సీనియర్ నేతలకే పార్టీ చీఫ్ పగ్గాలు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారికే ఈసారి చీఫ్ పదవి ఇవ్వనున్నట్టు శ్రేణులుల మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డి గత జూలైలో నియమితులయ్యారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వచ్చే నెలలో కిషన్ రెడ్డి చీఫ్ బాధ్యతలనుంచి తప్పించి... మరో సీనియర్ నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు అధినాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది.