Delhi Water Crisis: ఢిల్లీ ప్రజలను వేధిస్తున్న నీటి సంక్షోభం
నీటి ట్యాంకర్ల కోసం ఢిల్లీ వాసుల ఎదురుచూపు
Delhi Water Crisis : దేశ రాజధానిని నీటి కొరత వేధిస్తోంది. ఈ ఉదయం గీతా కాలనీకి చెందిన ప్రజలు రోజువారి నీటి అవసరాల కోసం ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. కేవలం ఒక్క గీతా కాలనీకి మాత్రమే ఇది పరిమితం కాలేదు. యావత్ ఢిల్లీ నగరం ప్రస్తుతం మంచినీటి కొరతతో సతమతమవుతోంది. ప్రజలు నీటి అవసరాలకు ప్లాస్టిక్ కంటైనర్లలో నీటిని పట్టుకొని తీసుకువెళ్తున్న దృశ్యాలు ఢిల్లీలో నగరంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. నీరు లేక ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వంట చేసుకోవడంతో పాటు ఇతర అవసరాలకు నీరు లేకుండా పోతోందని వాపోతున్నారు.
ఉదయం 6 గంటలకు ప్లాస్టిక్క్యాన్లతో జనాలు రోడ్డు ఎక్కుతున్నారు. నీటి ట్యాంకర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వాటర్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో తెలియదు...ఎక్కడకు వస్తుందో తెలియదు కాని జనాలు మాత్రం ఉడయం 6గంటల కంటే ముందు నుంచే వాటర్ కోసం బారులు తీరతారు. ట్యాంకర్ ఎప్పుడూ వస్తుందా అని కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి ఒక్క ట్యాంకరే వస్తుందని ఢిల్లీ వాసులు ఆవేదన చెందుతున్నారు.