Ratan Tata:ముగిసిన రతన్ టాటా శకం..ఆయన సాధించిన విజయాలు ఇవే.. టాటా సాల్ట్ నుంచి సాఫ్ట్ వేర్ వరకూ చెరగని ముద్ర
రతన్ టాటా మరణంతో భారత వ్యాపార ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన 86వ ఏట ముంబైలోని బీచ్ కాండి హాస్పిటల్లో కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
రతన్ టాటా మరణంతో భారత వ్యాపార ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన 86వ ఏట ముంబైలోని బీచ్ కాండి హాస్పిటల్లో కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం. టాటా అంటే గుండు పిన్నీసు నుంచి విమానాల వరకు... ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ వరకూ విస్తరించిన ఒక మహా వ్యాపార సామ్రాజ్యం.
155 సంవత్సరాల చరిత్ర ఉన్న టాటా గ్రూప్ చైర్మన్లలో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన చైర్మన్ గా రతన్ టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. టాటా అంటే రతన్ టాటా అనే స్థాయికి గ్రూప్ కంపెనీలను తీసుకెళ్లాడంటే . ఆయన ప్రతిభ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28వ తేదీ ముంబైలోని పార్సి జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు నావెల్ టాటా,
రతన్ టాటా విద్యాభ్యాసం ముంబైలోని కాంపియన్ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాలోని కార్నల్ యూనివర్సిటీకి వెళ్లారు అక్కడే ఆయన ఆర్కిటెక్చర్ విభాగంలో డిగ్రీ పొందారు. నిజానికి రతన్ టాటా ఎంట్రీ టాటా గ్రూపులో రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసినట్లు జరగలేదు. ఎందుకంటే రతన్ టాటా, టాటా కుటుంబానికి చెిందినవాడే కానీ ఆ కుటుంబంలో అప్పటికే చాలామంది వారసులు ఉన్నారు.
రతన్ టాటా తండ్రి నావల్, టాటాల కుటుంబంలోకి ఒక దత్త పుత్రుడు మాత్రమే. అందుకే రతన్ టాటాకు టాటా కంపెనీలో ప్రవేశం ఒక సాధారణ ఉద్యోగి రూపంలోనే జరిగింది. రతన్ టాటా 1962లో టాటా గ్రూప్లో టాటా ఇండస్ట్రీస్లో అసిస్టెంట్గా చేరారు; టాటా ఇంజనీరింగ్, లోకోమోటివ్ కంపెనీ, టెల్కో (ఇప్పుడు టాటా మోటార్స్ అని పిలుస్తున్నారు) జంషెడ్పూర్ ప్లాంట్లో ఆరు నెలల శిక్షణను పొందారు. తర్వాత 1963లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టిస్కో (ఇప్పుడు టాటా స్టీల్ అని పిలుస్తున్నారు) దాని జంషెడ్పూర్ ఫెసిలిటీలో అసిస్టెంట్ గా పనిచేశారు.
1970లో టాటా కంప్యూటర్ సిస్టమ్స్గా ప్రారంభించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో రతన్ టాటా ప్రవేశించారు. ప్రపంచంలో కంప్యూటర్ సాఫ్ట్ వేర్ రంగం ఇంకా మొగ్గ దశలోనే ఉన్న సమయంలో రతన్ టాటా టీసీఎస్ లో పనిచేశారు. ఇక 1971లో టాటా గ్రూపులో్ కష్టాల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ (నెల్కో) డైరెక్టర్-ఇన్చార్జ్ గా బాధ్యతలు చేపట్టి దాన్ని గాడిలో పెట్టారు. ఇక 1974లో టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్గా చేరారు. మధ్యలో 1975వ సంవత్సరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను పూర్తి చేశారు.
1981లో టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్గా నియమితులయ్యారు. రెండు సంవత్సరాల తరువాత, టాటా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1986-1989 మధ్య కాలంలో ఎయిర్ ఇండియా ఛైర్మన్గా పనిచేశారు 1991లో ఎట్టకేలకు టాటా సన్స్, టాటా ట్రస్ట్ల ఛైర్మన్గా JRD టాటా నుండి రతన్ టాటా పగ్గాలు స్వీకరించారు.
రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూపు సాధించిన విజయాలు ఇవే..
2000: బ్రిటీష్ టీ బ్రాండ్ టెట్లీని కొనుగోలు చేసి టాటా బేవరేజేస్ కంపెనీని గ్లోబల్ బ్రాండ్ గా చేశారు.
2004: TCS ఐపీవో ద్వారా చరిత్ర సృష్టించారు.
2005: టాటా కెమికల్స్ బ్రిటిష్ కంపెనీ బ్రన్నర్ మోండ్ని కొనుగోలు చేసింది
2007: యూరోపియన్ స్టీల్ దిగ్గజం కోరస్ను కొనుగోలు చేసింది
2008: జాగ్వార్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేసింది
2008: భారతదేశంలో అత్యంత సరసమైన కారు టాటా నానోను విడుదల చేసింది
2008: దేశం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ లభించింది
2012: టాటా గ్రూప్తో ఐదు దశాబ్దాల అనుబంధం తర్వాత రతన్ టాటా, టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు, సైరస్ మిస్త్రీకి బాధ్యతలు అందించారు. టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్గా నియమితులయ్యారు
2016: సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించారు;
అక్టోబరు 2016-ఫిబ్రవరి 2017: టాటా గ్రూప్కు తాత్కాలిక చైర్మన్గా పని చేశారు.
2018: టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ టాటా చైర్మన్ బాధ్యతల స్వీకరణ
2017 నుండి: 30కు పైగదా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టారు.
భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సన్మానించింది. ఆయన తన దానధర్మాలకు కూడా ప్రసిద్ధి చెందారు తన ఆస్తిలో సుమారు 60 శాతం దానధర్మాలకే కేటాయించేవారు. రతన్ టాటా చరిత్ర గురించి చెప్పాలంటే ఒక వ్యాసం సరిపోదు ఒక మహా గ్రంథం అయినా సరిపోదు. ఈ దేశంలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక రతన్ టాటా నీడలా నిలబడ్డారు. దేశ సరిహద్దుల్లో జవాన్ నుంచి పొలాల్లో రైతుల వరకు టాటా తన వ్యాపారం ద్వారా సేవలను అందించింది.
ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి సొంత కారులో కుటుంబంతో సహా వెళ్లాలని కలలుకని ఎంతో ఇష్టంగా డిజైన్ చేసి విడుదల చేసిన టాటా నానో కారు. రతన్ టాటా అభిరుచికి నిదర్శనం. దేశంలోని సామాన్యులకు సైతం టాటా తన ఉత్పత్తుల ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా చేరువైంది. నేడు భారతదేశంలో ఐటీ రంగ విప్లవం వెనుక రతన్ టాటా కృషి అనితర సాధ్యమైనదని చెప్పవచ్చు.
ప్రపంచంలోనే నెంబర్ వన్ ఐటీ సర్వీసుల సంస్థగా టిసిఎస్ ఎదిగింది. సుమారు పది లక్షల మంది ఉద్యోగులు టాటా గ్రూపు సంస్థల ద్వారా నేడు ఉపాధిని పొందుతున్నారు. అంతకు పదిరెట్లు మంది పరోక్షంగా టాటా సంస్థల నుంచి ఉపాధిని పొందుతున్నారు...రతన్ టాటాను ఆధునిక భారత జాతి నిర్మాతగా కీర్తించినా తక్కువే.