నేడు ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం
రాష్ట్రపతి భవన్ లాన్స్లో రా.7:15కు కార్యక్రమం
మరికొన్ని గంటల్లో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లాన్స్లో రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోడీతో ప్రమాణం చేయించనున్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పలు దేశాధినేతలు, జాతీయ నేతలు, గవర్నర్లు రానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు మహ్మద్ ఆఫిఫ్, మారిషస్ ప్రధాని ప్రవింద్, నేపాల్ ప్రధాని కమల్ దహల్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, ప్రత్యేక ఆహ్వానితులుగా వందే భారత్ లోకో పైలెట్లు, పారిశుద్ధ్య కార్మికులు, సెంట్రల్ విస్టా కార్మికులు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. మొత్తం 10వేల మంది మోడీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది.
మరోవైపు.. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో.. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇవాళ, రేపు సెంట్రల్ ఢిల్లీలో నో ఫ్లై జోన్గా ప్రకటించారు. అటు.. తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్, ఒబెరాయ్ హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. 2 వేల 5 వందల మంది పోలీసులు సహా పారామిలిటరీ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు.