
Waqf Bill: వివాదాస్పద వక్ఫ్ బిల్లును కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. వారి నిరసనల నడుమే కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై చర్చను చేపట్టారు. దాదాపు 8గంటలపాటు చర్చ జరిగిన అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ బిల్లును ఆమోదింపచేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది..అయితే విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.
వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసే విధంగా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులోనే కేంద్రం లోకసభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్దెత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించింది. ఈ కమీట పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లును కేంద్రం నేడు లోకసభ ముందుకు తీసుకువచ్చింది. లోకసభలో ఆమోదం పొందిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల్లో అధికార ఎన్డీయేకు మెజార్టీ ఉన్నందున బిల్లు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజీపీ భావిస్తోంది.