
కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ దేవాలయంలో వీడియో తీశారన్న ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్పై ఫిర్యాదు నమోదైంది. తిరువనంతపురానికి చెందిన కాంగ్రెస్ నేత, హైకోర్టు న్యాయవాది వీఆర్ అనూప్ ఈ ఫిర్యాదును దేవాలయ పోలీసులకు అందజేశారు. ఆయన అభియోగం ప్రకారం, దేవస్థానం ప్రాంగణంలో నిషేధిత ప్రాంతంలో ఈ వీడియో తీశారంటూ ఆయన ఆరోపించారు.
ఈ ఘటనపై విమర్శలు పెరిగిపోతున్నాయి. గతంలో ఇలాంటి చర్యలపై గట్టిగా స్పందించిన గురువాయూర్ దేవస్థానం బోర్డు, ఇప్పుడు మాత్రం నామమాత్రంగా వ్యవహరిస్తోందని విమర్శకులు అంటున్నారు. గత ఏడాది, అదే దేవాలయ ప్రాంగణంలో రీల్ తీసినందుకు కళాకారిణి జస్నా సలీమ్పై కేసు నమోదు చేయడాన్ని ఇప్పుడు ఉదాహరణగా వినిపిస్తున్నారు. అప్పట్లో అధికారులు కఠినంగా వ్యవహరించగా, ఇప్పుడు మాత్రం బీజేపీ నేతపై ఇలాంటివే ఆరోపణలుంటే ఎలా మౌనంగా ఉండగలరు అని ప్రశ్నిస్తున్నారు.
కేరళ హైకోర్టు దేవాలయాల్లో, ముఖ్యంగా గర్భగుడి పరిసరాల్లో వీడియో తీయడాన్ని స్పష్టంగా నిషేధించింది. అయినప్పటికీ ఈ నియమాన్ని ఉల్లంఘించడం ప్రశ్నార్థకమవుతోంది. దీనిపై అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, నియమాలు అందరికీ సమానంగా వర్తించాలన్నదే విమర్శకుల డిమాండ్.
ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమవుతోంది. అధికారుల ప్రస్తుత స్పందన దేవస్వం బోర్డు నిజంగా ఒక విధమైన పొలిటికల్ ప్రెజర్తో పనిచేస్తుందనే అనుమానాలకు తావిస్తోంది.