N convention centre: ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై ఆ వార్తల్లో నిజం లేదు.. నాగ్ మరో ప్రకటన

N కన్వెన్షన్ సెంటర్ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో వస్తోన్న వార్తా కథనాలపై అక్కినేని నాగార్జున స్పందించారు.

Update: 2024-08-25 14:11 GMT

N Convention Centre Latest News : ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హీరో అక్కినేని నాగార్జున మరోసారి స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసిన నాగార్జున.. ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ అంటూ తాను చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని గతంలోనే ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిందని.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా పట్టా భూమిలో నిర్మించిందేనని నాగ్ మరోసారి స్పష్టంచేశారు.

ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందున కోర్టు తీర్పు వచ్చే వరకు వేచిచూడాలని.. అప్పటివరకు ఎవరు ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా నమ్మొద్దని నాగార్జున అభిమానులకు విజ్ఞప్తి చేశారు. N కన్వెన్షన్ సెంటర్‌కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి అని నాగ్ అసంతృప్తి వ్యక్తంచేశారు.

ప్రస్తుతానికి N కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగిందని తెలిపారు. కోర్టు తీర్పుని తాను గౌరవిస్తానని నాగ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 


Tags:    

Similar News