MUDA Scam Updates: కోర్టుకు వెళ్లిన సీఎం సిద్ధరామయ్య
MUDA Scam Updates: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
MUDA Scam Updates: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్థలాల కేటాయింపు స్కామ్ కేసు విషయంలో సీఎం సిద్ధరామయ్యను ప్రశ్నించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనపై విచారణకు అనుమతించిన గవర్నర్ ఆదేశాలను రద్దు చేయాల్సిందిగా కోరుతూ సీఎం సిద్ధరామయ్య హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులు సరైన అవగాహన లేకుండా జారీ చేసినవి అని సిద్ధరామయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. గవర్నర్ ఉత్తర్వులు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. "గవర్నర్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా లేదు. అందులో విధానపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బయటి శక్తుల ప్రోద్బలంతోనే తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. అందుకే తనపై విచారణకు అనుమతిస్తూ ఆగస్టు 16 నాడు గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాల్సిందిగా సీఎం సిద్ధరామయ్య కోర్టుకి విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను "తనకు ఉన్న తిరుగులేని ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగా" సీఎం సిద్ధరామయ్య అభివర్ణించారు. తాను ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తానని.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గెను కలిసి జరిగింది చెబుతానని మీడియాకు తెలిపారు.