Kolkata Doctor Case: Polygraph పరీక్షలో సంజయ్ రాయ్‌ ఏం చెప్పాడు? అతడిలో జంతు ప్రవృత్తి ఉందా?

Sanjay Roy Polygraph Test: కోల్ కతా హైకోర్టు ఆదేశం ప్రకారం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయన గతంలో చెప్పిన దానికి భిన్నంగా తనకు ఏమీ తెలియదని చెప్పినట్లు తెలిసింది.

Update: 2024-08-27 08:38 GMT

Kolkata Doctor Case: Polygraph పరీక్షలో సంజయ్ రాయ్‌ ఏం చెప్పాడు? అతడిలో జంతు ప్రవృత్తి ఉందా?

Sanjay Roy Polygraph Test: ఒక మనిషిలో జంతు ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది? ఎలాంటి పరిస్థితులు ఒక మామూలు మనిషిని పశువుగా మార్చేస్తాయి? దేశమంతటా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ రేప్ – మర్డర్ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌లో జంతు ప్రవృత్తి ఉందని సైకాలజిస్టులు గుర్తించారు. స్కూల్ డేస్‌లో టాపర్‌గా ఉన్న సంజయ్ ఇంత దారుణంగా ఎలా మారాడు? పాలిగ్రాఫ్ పరీక్షలో ఏం చెప్పాడు?

కోల్ కతా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య కేసులో ఆగస్టు 10న పోలీసులు సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ జీ కార్ ఆసుపత్రి సెమినార్ హాల్ లో ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన 36 గంటల్లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన స్థలంలో దొరికిన ఫోన్ బ్లూటూత్ పోలీసులకు ఆయన చిక్కేలా చేశాయి. కోర్టు అనుమతితో నిందితుడికి సీబీఐ అధికారులు పాలీగ్రాఫ్ పరీక్షలు చేశారు.

స్కూల్ టాపర్ వ్యసనాలకు బానిసగా ఎలా మారాడు?

సంజయ్ రాయ్ తండ్రి చాలా స్ట్రిక్ట్. అయితే ఆయన తల్లి మాత్రం ఆయనను కొంచెం గారాబం చేసేది. స్కూల్ లో చదివే రోజుల్లో రాయ్ టాపర్ గా ఉండేవాడని ఆయన తల్లి ఓ ఇంగ్లీష్ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తనంటే ఆయనకు అమితమైన ప్రేమ... కొన్ని సార్లు తన కోసం వంట కూడా చేసి పెట్టేవాడని ఆమె తెలిపారు. రాయ్ కు నలుగురు చెల్లెళ్లున్నారు.

చిన్నతనం నుంచి ఆయనకు బాక్సింగ్ అంటే ఇష్టం. దీంతో ఆయన బాక్సింగ్ కూడా నేర్చుకున్నారు. స్కూల్ డేస్ లో ఎన్ సీసీలో ఆయన చురుకుగా పాల్గొనేవారు. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలు రాయ్ పై పడ్డాయి.

తండ్రి చనిపోయిన కొన్ని రోజులకు ఆయనకు పెళ్లైంది. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవారని తల్లి చెప్పారు. పెళ్లైన కొన్ని రోజులకే రాయ్ భార్యకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ తో ఆమె చనిపోయింది. భార్య మరణం సంజయ్ రాయ్ ను మానసికంగా కుంగదీసింది. ఆయన తాగుడుకు బానిసగా మారాడు. అతడిని మామూలు మనిషిగా మార్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఒక్కటి కాదు... మరో మూడు పెళ్లిళ్లు చేశారు. ముగ్గురు భార్యలూ అతడిని వదిలేసి వెళ్ళిపోయారు.

భార్య మరణంతో తాగుడుకు బానిసగా మారిన సంజయ్ రాయ్ ను మార్చాలని తల్లి అతనికి నచ్చజెప్పారు. మరో పెళ్లి చేశారు. అయితే కొన్ని రోజులకే భార్య అతడిని వదిలి వెళ్లింది. ఆ తర్వాత మరో రెండు పెళ్లిళ్లు చేసినా కూడా వారిద్దరూ కూడా ఎక్కువ రోజులు సంజయ్ రాయ్ తో కాపురం చేయలేదు.

పోర్న్ వీడియోలకు బానిస అయ్యాడు...

రాయ్ క్రమంగా పోర్న్ వీడియోలకు కూడా బానిస అయ్యాడని పోలీసులు చెబుతున్నారు. అతని ఫోన్ లో ఫోర్న్ క్లిప్పింగ్స్ ను గుర్తించారు. సంజయ్ రాయ్‌ను పరీక్షించిన మానసిక వైద్యులు అతడిలో జంతు ప్రవృత్తి పెరిగిపోయిందని గుర్తించారు. ముగ్గురు భార్యలు కూడా అతడి ప్రవర్తను తట్టుకోలేక వెళ్ళిపోయారని చెప్పారు.

అతడి ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు రాయ్ మద్యం తాగి రాత్రుళ్ళు ఆలస్యంగా ఇంటికి వస్తుంటారని చెప్పారు. అయితే, ఆ మాటలను అతడి తల్లి కొట్టిపారేస్తున్నారు. తన కుమారుడు ఈ నేరం చేసి ఉండరనే ఆమె భావిస్తున్నారు. ఒకవేళ ఈ నేరం చేసి ఉంటే దేవుడే అతడిని శిక్షిస్తాడని ఆమె అన్నారు. అతడి చెల్లి కూడా తన సోదరుడు ఈ తప్పు చేసి ఉండరని అంటున్నారు. ఒకవేళ ఆ తప్పు చేస్తే అతడు శిక్షకు అర్హుడేనని ఆమె చెప్పారు.

ఫ్రెండ్‌తో కలిసి రెడ్ లైట్ ఏరియాకు..

ట్రైనీ డాక్టర్ హత్య జరిగిన రోజున స్నేహితుడితో కలిసి ఆయన రెడ్ లైట్ ఏరియాకు వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్లే ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయి. స్నేహితుడు రెడ్ లైట్ ఏరియాలో గడిపిన సమయంలో ఆయన బయట కాపలా ఉన్నారు. తన గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడారు.

అంతేకాదు ఆమె న్యూడ్ వీడియోను తెప్పించుకున్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారని ఇంగ్లీష్ పత్రిక రిపోర్ట్ చేసింది. రెడ్ లైట్ ఏరియా నుంచి ఆయన నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున ఆసుపత్రి సెమినార్ హాలులోకి వెళ్లి బయటకు వచ్చినట్టుగా సీసీటీవీ పుటేజీలో రికార్డైంది. కాల్ డేటా రికార్డ్ , నిందితుడు ఉపయోగించిన బ్లూటూత్ ఆధారంగా పోలీసులు రాయ్ ను అరెస్ట్ చేశారు.

పాలిగ్రాఫ్ పరీక్షలతో కేసులో కొత్త ట్విస్ట్

కోల్ కతా హైకోర్టు ఆదేశం ప్రకారం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయన గతంలో చెప్పిన దానికి భిన్నంగా తనకు ఏమీ తెలియదని చెప్పినట్లు తెలిసింది. తాను సెమినార్ హాల్ లోకి వెళ్లేసరికి డాక్టర్ చనిపోయి ఉండడం చూసి తాను భయంతో బయటకు వచ్చానని ఆయన పాలిగ్రాఫ్‌లో చెప్పారు.

మొదట్లో సంజయ్... హత్య చేశాను... ఉరి తీసుకోండి అని పోలీసులకు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. పాలిగ్రాఫ్ పరీక్షలో దానికి పూర్తి భిన్నంగా చెప్పినట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు పాలీగ్రాఫ్ పరీక్షల్లో అతడు పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఈ విషయంలో తన తప్పేం లేదని, తాను సెమినార్ హాల్ లోకి వెళ్లేసరికి డాక్టర్ చనిపోయి ఉండడం చూసి తాను భయంతో బయటకు వచ్చినట్లు చెప్పినట్లు తెలిసింది.

పాలిగ్రాఫ్ పరీక్షల్లో సంజయ్ చెప్పిన మాటలు ఈ కేసును కొత్త మలుపు తిప్పాయి. ఈ ట్విస్టును దర్యాప్తు అధికారులు ఎలా ఛేదిస్తారన్నది కీలక ప్రశ్నగా మారింది. సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి మరిన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. కోల్ కతా పోలీసులు ఈ కేసును హ్యాండిల్ చేసిన తీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే, సీబీఐ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పక్కా ఆధారాలతో నిందితుడిని బోనులో నిలబట్టె ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News