Supreme Court: ఈశా ఫౌండేషన్​కు సుప్రీంకోర్టులో ఊరట

Supreme Court: ఫౌండేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశం

Update: 2024-10-03 15:15 GMT

Supreme Court: ఈశా ఫౌండేషన్​కు సుప్రీంకోర్టులో ఊరట

Supreme Court: మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నారన్న కేసులో ఈశా ఫౌండేషన్​కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫౌండేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. అందుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టు వివరాలను తమకు సమర్పించాలని వెల్లడించింది. ఈ వ్యవహారంపై ఇద్దరు యువతుల తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం తనకు తాను బదిలీ చేసుకుంది.

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్‌ కామరాజ్‌ మద్రాసు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈశా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండి పోయారని తెలిపారు. తమ కుమార్తెలను గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోందని ఆయన ఆరోపించారు.

ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులను తాజాగా మద్రాసు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈశా ఫౌండేషన్ అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది. సుమారు 150 మంది పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి, ప్రతి మూల శోధించారని ఫౌండేషన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి పోలీసు చర్యలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.

Tags:    

Similar News