ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు.. పలు చోట్ల ఎన్డీయే, ఇండియా కూటమి నెక్‌ టు నెక్

దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ లో ఇండియా కూటమి హవా కొనసాగుతోంది.

Update: 2024-06-04 07:36 GMT

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు.. పలు చోట్ల ఎన్డీయే, ఇండియా కూటమి నెక్‌ టు నెక్

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తోంది. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో ప్రచార బరిలోకి దిగిన ఎన్డీయే.. 290కి పైగా సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. యూపీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది.

దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ లో ఇండియా కూటమి హవా కొనసాగుతోంది. అక్కడి 80 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇప్పటికే 40కి పైగా స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం కనబరుస్తోండగా.. బీజేపీ 36 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. గత ఎన్నికల్లో 62 స్థానాలు ఈ రాష్ట్రంలోనే గెలిచిన బీజేపీకి, ఈ సారి ఎదురుగాలి వీస్తోంది.

మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలు ఉండగా.. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌ లో 26 స్థానాల్లో ఎన్డీయే, 20 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. వెస్ట్ బెంగాల్‌లోనూ తృణమూల్ కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 22 స్థానాలు సాధించిన టీఎంసీ.. ఈ సారి కూడా 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే 2019 ఎన్నికల్లో 18 స్థానాలు గెలిచిన బీజేపీ మాత్రం 12 స్థానాల్లోనే లీడింగ్ లో ఉంది.

మెజారిటీ స్థానాలు సాధించాల్సిన పెద్ద రాష్ట్రాల్లోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో.. భారీ మెజారిటీపై అంచనాలు పెట్టుకున్న ఎన్డీయే 3 వందల స్థానాల దగ్గరే ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News