ఆ నలుగురూ నన్ను శారీరకంగా... నటి సంచలన ఆరోపణలు

మళయాళం పరిశ్రమను మీ టూ ఉద్యమం కుదిపేస్తోంది. హీరోయిన్స్, జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒక్కొక్కరిగా బయటికొచ్చి తమకు ఎదురైన లైంగిక వేధింపులపై బాహటంగానే ఫిర్యాదు చేస్తున్నారు.

Update: 2024-08-26 13:44 GMT

Malayalam Actress Allegations on Malayalam Actors: మళయాళం నటి మిను మునీర్ ప్రస్తుతం మాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఒక నలుగురు వ్యక్తులను ఉద్దేశించి మిను మునీర్ చేసిన ఆరోపణలు మళయాళం చిత్ర పరిశ్రమలో చర్చనియాంశమయ్యాయి. గతంలో మళయాళం సినీ పరిశ్రమకు సంబంధించిన నలుగురు వేర్వేరు వ్యక్తుల చేతుల్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

మళయాళంలో ప్రముఖ నటుడు ముఖేష్, మణియన్‌పిల్ల రాజు, ఇడవెల బాబు, జయసూర్య తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పేస్‌బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించింది.

మిను మునీర్ 2013 లో తాను ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. తాను సెట్స్‌లో ఉండగా టాయిలెట్ కోసమని రెస్ట్ రూమ్‌కి వెళ్లి బయటికి రాగానే జయసూర్య అకస్మాత్తుగా వచ్చి వెనక నుండి బిగ్గరగా పట్టుకున్నాడని.. అంతటితో ఆగకుండా తన అనుమతి లేకుండా ముద్దులు పెట్టాడని మిను మునీర్ వాపోయింది. ఈ అనుకోని పరిణామంతో ఖంగుతిన్న తాను అక్కడి నుండి భయంతో పరుగెత్తి బయటపడినట్లు చెప్పింది. అయితే, అతడు చెప్పినట్లుగా విని అతడితో ఉంటే.. తనకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తానని జయసూర్య బలవంతపెట్టాడు. కానీ తాను అతడి మాటలు వినిపించుకోలేదని ఆమె అప్పట్లో జరిగిన విషయాన్ని గుర్తుచేసుకుంది.

మరో ఘటనలో మళయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో (AMMA) సభ్యత్వం కోసం అమ్మ సెక్రటరిగా ఉన్న ఇడవెళ బాబును కోరగా.. అతడు అప్లికేషన్ ఇచ్చేందుకు తన ఫ్లాట్‌కి రావాల్సిందిగా చెప్పాడు. అసోసియేషన్ మెంబర్‌షిప్‌కి అప్లై చేసేందుకని అక్కడికి వెళ్తే.. అతడు కూడా తనని శారీరకంగా వేధించాడు అని మిను మునీర్ ఆవేదన వ్యక్తంచేసింది.

ఇక వేరే ఘటనలో ప్రస్తుతం అధికార పార్టీ అయిన సీపీఐ(ఎం) ఎమ్మెల్యేగా ఉన్న నటుడు ఎం ముఖేష్ కూడా తనని వేధించాడని గుర్తుచేసుకుంది. ముఖేష్‌ని కాదన్నానని చెప్పి అతడు కూడా తనకు మళయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం తిరస్కరించాడని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిను మునీర్ పేర్కొంది.

మళయాళం సినీ పరిశ్రమలో అమ్మాయిలపై చాలా వేధింపులు నడుస్తున్నాయి. అవన్నీ భరించలేక తాను చెన్నైకి వెళ్లిపోయాను. అక్కడే ఉండి తాను భరిస్తూ పోతుంటే వాళ్ల వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. వాళ్ల వేధింపులతో నాకు నరకం చూపించారు. ఇక చివరకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చెన్నైకి మకాం మార్చాను. ఆ నలుగురి వల్లే తాను మళయాళం ఇండస్ట్రీని విడిచిపెట్టాల్సి వచ్చింది. " అప్పుడు కూడా ఏమైంది, ఎందుకు వెళ్లిపోయావ్ " అంటూ ఎవ్వరూ తనని పరామర్శించిన దాఖలాలు లేవని మిను మునీర్ ఆనాటి చేదు జ్ఞాపకాలను మరోసారి నెమరేసుకుంది. అంతేకాదు.. ఇంతకాలం తాను అనుభవించిన మనోవేదనకు తనకు న్యాయం కావాలి అని మిను మునీర్ డిమాండ్ చేస్తున్నారు.

మిను మునీర్ ఆరోపణలు చేసిన వారిలో ఒకరైన మణియన్‌పిల్ల రాజు ఆమె ఆరోపణలపై స్పందిస్తూ.. " కొంతమంది ఇలాంటి వివాదాలను క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంటారు. అందుకోసం వాళ్లు ఏమైనా చెబుతారు. నిజం ఏంటనేది దర్యాప్తు చేసి నిజం నిగ్గుతేల్చాలి " అని మణియన్‌పిల్ల రాజు అభిప్రాయపడ్డాడు.

హీరోయిన్లు వరుసగా తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చిట్టా విప్పుతుండటంతో ప్రస్తుతం అందరి ఫోకస్ మళయాళం ఇండస్ట్రీపై పడింది. దీంతో కేరళ సీఎం పినరయి విజయన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆదివారం సీనియర్ పోలీసు అధికారులతో సీఎం విజయన్ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఏడుగురు పోలీసు అధికారులతో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరెవరైతే శారీరక వేధింపులకు గురయ్యాం అని ఫిర్యాదులు చేస్తున్నారో, వారి ఫిర్యాదులపై విచారణ చేపట్టాల్సిందిగా కేరళ సీఎం విజయన్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News