Brazil: బ్రెజిల్‌లో బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం.. నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టుపై దాడి

Brazil: రంగంలోకి భద్రతా దళాలు.. అల్లర్లను ఖండించిన ప్రపంచ నేతలు

Update: 2023-01-09 06:39 GMT

Brazil: బ్రెజిల్‌లో బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం.. నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టుపై దాడి

Brazil: బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో మద్దతుదారులు దేశ రాజధాని బ్రెసీలియాలో విధ్వంసం సృష్టించారు. 2021, డిసెంబర్‌లో అమెరికాలో జరిగిన యూఎస్‌ క్యాపిటల్‌ విధ్వంసం తరహాలో.. నేషనల్‌ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు, అధ్యక్షుడి ప్యాలెస్‌పై దాడిచేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆకుపచ్చ, పసుపు దుస్తులు వేసుకుని రోడ్లపైకి వచ్చిన వందలాది మంది నిరసనకారులు నేషనల్‌ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు, అధ్యక్షుడి ప్యాలెస్‌లోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆందోళనకారుల దాడిలో నేషనల్ కాంగ్రెస్ భవనం ధ్వంసమైంది. బిల్డింగ్‌పై 'జోక్యం చేసుకోండి (ఇంటర్​వెన్షన్)' అంటూ సైన్యాన్ని ఉద్దేశించి బ్యానర్లు ఎగరేశారు. చట్టసభ్యుల కార్యాలయాల్లోకి చొరబడి నాశనం చేశారు. ఇప్పుడీ దాడి దృష్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

దేశంలో గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లులా డా సిల్వా చేతిలో బోల్సనారో ఓడిపోయారు.అప్పటి నుంచి.. బోల్సనారో మద్దతుదారులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. దేశంలోని మిలిటరీ స్థావరాలకు వెళ్లి.. రాజకీయ విషయంలో సైన్యం జోక్యంచేసుకోవాలని కోరుతూవస్తున్నారు.

కాగా, అత్యున్నత పరిపాలనా భవనాలపై దాడిఘటనపై అధ్యక్ష, మాజీ అధ్యక్షులు తీవ్రంగా ఖండిచారు. దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజుని, ఫాసిస్ట్‌లు చాలా తప్పు చేశారని అధ్యక్షుడు లూలా డా సిల్వా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా భవనాలపై జరిగిన దోపిడీ, దండయాత్రను ఖండిస్తున్నాని బోల్సొనారో అన్నారు. ఈ ఘటనల వెనుక తానున్నానని అధ్యక్షుడు లూలా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. కానీ.. శాంతియుతంగా నిరసనలు చేయడంలో తప్పులేదని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News