Top-6 News of the Day: కేసీఆర్ కు కోర్టు నోటీసులు: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-08-06 12:30 GMT

Top-6 News of the Day: కేసీఆర్ కు కోర్టు నోటీసులు: మరో 5 ముఖ్యాంశాలు

1. కేసీఆర్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు


 కేసీఆర్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరు కావాలని ఆ నోటీసులో కోర్టు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలు నెరవేరకుండా పోయాయని పిటిషనర్ ఆరోపించారు. ఈ నోటీసులను రిజిస్టర్ పోస్టులో పంపారు.

2. వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు


 వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ భరత్ పై గుంటూరు అరండల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు నమోదైంది. తిరుమల తోమాల సేవ పేరుతో సిఫారసు లేఖలు విక్రయించారని తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భరత్ తో పాటు ఆయన పీఆర్ ఓ మల్లికార్జునపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా భరత్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చంద్రబాబును ఓడించి భరత్ ను గెలిపిస్తే ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని గతంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

3. బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు


 షేక్ హసీనా రాజీనామాతో పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్టుగా ఆ దేశ అధ్యక్షులు షహబుద్దీన్ మంగళవారం ప్రకటించారు. మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టారు. నిరసన చేస్తున్న విద్యార్ధులతో పాటు దేశంలోని రాజకీయపక్షాలతో అధ్యక్షులు చర్చలు జరిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ ఏదాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించింది. ఈ ఎన్నికలను బీఎన్ పీ బహిష్కరించింది.

4. అద్వానీకి అస్వస్థత ఆసుపత్రిలో చేరిక


 ఎల్ కే అద్వానీ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను దిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించారు. వృద్దాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ ఏడాది జూన్, జూలై మాసాల్లో కూడా ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స తర్వాత వైద్యులు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

5. ఏపీలో అకాడమీ ఏర్పాటు చేయండి: యూట్యూబ్ సీఈఓను కోరిన చంద్రబాబు


 చంద్రబాబు నాయుడు మంగళవారం యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్, గూగుల్ ఏపీ హెడ్ సంజయ్ గుప్తాలతో వర్చువల్ గా సమావేశమయ్యారు. కంటెంట్, స్కిల్ డెవలప్ మెంట్ వంటి అంశాలపై చర్చించారు. అంతేకాదు ఏపీలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. అమరావతి మీడియాసిటీలో ఏర్పాటు విసయాన్ని ఆయన ప్రస్తావించారు. యూట్యూబ్ సీఈఓతో చర్చించిన అంశాలను చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

6. హైద్రాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్: తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం


 కాగ్నిజెంట్ హైద్రాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైద్రాబాద్ లో 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా కొత్త సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, కంపెనీ బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

Tags:    

Similar News