AP Election Results: తిరుపతి జిల్లాలో హై అలర్ట్.. చంద్రగిరిలో భారీగా పోలీసుల మోహరింపు
AP Election Results: పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల చెలరేగిన హింస నేపథ్యంలో కౌంటింగ్కు వారం ముందు నుంచే తిరుపతి జిల్లా అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు.
AP Election Results: పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల చెలరేగిన హింస నేపథ్యంలో కౌంటింగ్కు వారం ముందు నుంచే తిరుపతి జిల్లా అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ముఖ్యంగా కౌంటింగ్ రోజున హింసకు తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గెలిచినవారు ఆనందోత్సాహాలతోనూ, ఓడినవారు నిస్పృహతోనూ దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలో 696 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా, అందులో చంద్రగిరి నియోజకవర్గంలోనే 397 ఉన్నాయి. వీటిలో 202 సమస్యాత్మక కేంద్రాలుగా ఎన్నికల సంఘం గుర్తించి 100 శాతం వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసింది. అయినా ఎన్నికల తర్వాత హింసను పోలీసు యంత్రాంగం నిరోధించలేక పోయింది.
కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లె, పులివర్తి వారిపల్లె, బ్రాహ్మణకాలువ, తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీల వద్ద చోటు చేసుకున్న ఘటనల్లో పోలీసులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో దాదాపు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఈప్రదేశాలతో పాటూ చంద్రగిరి నియోజకవర్గంలోని నడవలూరు, దిగువ రామాపురం, అనుప్పల్లె, పాకాల మండలం పులివర్తివారిపల్లె, వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి, గూడూరు నియోజకవర్గం చిల్లకూరు ప్రాంతాల్లోనూ ముందస్తుగా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లపై ఎస్పీ హర్షవర్దన్ రాజు అధికారులతో సమావేశమయ్యారు. చంద్రగిరి మండలం కూచువారిపల్లె, రామిరెడ్డిపల్లె గ్రామాలను ఆయన స్వయంగా పరిశీలించి అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. బుధవారం ఆ రెండు గ్రామాల్లో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.