Gutha Sukender Reddy: రైతుబంధు, రైతు భరోసా పది ఎకరాలకు ఇస్తే చాలు
Gutha Sukender Reddy: ఇద్దరు సీఎంల భేటీ శుభపరిణామమని.. రెండు రాష్ట్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.
Gutha Sukender Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల భేటీ శుభపరిణామమని తెలంగాణ శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
బుధవారం నాడు ఆయన నల్గొండలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. క్రిష్ణ జలాల విషయంలో తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన వాటాను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాల బెదిరింపులకు తలొగ్గవద్దని చంద్రబాబుకు సుఖేందర్ రెడ్డి సూచించారు. తెలంగాణలో శాసనమండలి రద్దు అనే ఆలోచన లేదన్నారు . ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచుకొనే వెసులుబాటును ఏపీ పునర్విభజన చట్టం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేసిందని...దుబారా ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా రైతుబంధు, రైతు భరోసా పది ఎకరాల వరకు ఇస్తే చాలని ఆయన సలహా ఇచ్చారు. ఇక సేద్యం చేసే భూములకే రైతుబంధు ఇవ్వాలన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో మాదిరిగానే తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. రైతుభరోసాపై అభిప్రాయ సేకరణ మంచిదేనన్నారు గుత్తా సుఖేందర్రెడ్డి.