TOP 6 NEWS @ 6PM: కేసీఆర్ హయాంలో అందుకే ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయ్యాయి - కేటీఆర్

కేసీఆర్ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యంపై కేటీఆర్ వివరణ
1) పోలవరం ప్రాజెక్టును జగనే పక్కనపెట్టారు.. అంతేకాదు, ఆ నిధులను కూడా... - జగన్పై చంద్రబాబు ఆరోపణలు
ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి జగన్ ఆ నిధులను ఇతర పథకాలకు ఖర్చు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అంతేకాదు.. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు భూనిర్వాసితులకు రూ. 10 లక్షల నష్ట పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక వారికి నయా పైస కూడా ఇవ్వలేదన్నారు.
ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులు వరదల్లో నష్టపోయినప్పుడు కూడా వారిని జగన్ పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా నిర్వాసితులతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
2) ఏపీ సర్కారుకు, బిల్గేట్స్ ఫౌండేషన్కు మధ్య మరో ముందడుగు
ఏపీ సర్కారుకు, బిల్గేట్స్ ఫౌండేషన్కు మధ్య ఒప్పందం అమలు చేసేందుకు మరో ముందడుగు పడింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ఫోర్స్ బృందంలో అన్ని రంగాలకు చెందిన మొత్తం 26 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు.
ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ బిల్గేట్స్ను కలిసి ఒక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. సుపరిపాలన, వైద్య-ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో ఏపీ సర్కారు బిల్గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేయనుంది.
3) కేసీఆర్ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యంపై కేటీఆర్ వివరణ
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేకుండే అని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 2019 చివర్లో కరోనా వచ్చేంత వరకు జీతాలు సకాలంలోనే చెల్లించాం. కానీ కరోనా వచ్చిన తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. అలాంటి సమయంలో పేదలకు సంక్షేమం ఆపకుండా కొనసాగించడమే అప్పుడు తమ ప్రభుత్వం ముందున్న ధ్యేయంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు.
"ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల జీతాలు ఆగినా పర్వాలేదు కానీ రైతులకు రైతు బంధు ఆగొద్దని అనుకున్నాం. పేదలకు పెన్షన్స్ ఆగొద్దు... పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఆగొద్దని అనుకున్నాం. అందుకే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కొంత ఆలస్యం అయింది" అని కేటీఆర్ వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) Delimitation: డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి... అసలు డిమాండ్ ఏంటంటే...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రాలను యూనిట్స్ వారీగా తీసుకుని డీలిమిటేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి, కేంద్రం విధించిన లక్ష్యాలను అందుకోవడంలో విజయం సాధించాయి. దాంతో ఉత్తరాదిన జనాభా భారీగా పెరిగిపోయిందని, దక్షిణాదిని జనాభా పెరుగుదల పూర్తిగా అదుపులోకి వచ్చింది" అని అన్నారు. ఇలాంటి సందర్భంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) ఆ అల్లా ఎంత రాసి పెట్టి ఉంటే అంతే - లారెన్స్ బెదిరింపులపై సల్మాన్ ఖాన్ రియాక్షన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వేదాంత ధోరణిలోకి వెళ్లిపోయారు. సల్మాన్ ఖాన్ను చంపేస్తామని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఎప్పటి నుండో బెదిరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గతేడాది ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్పై కాల్పులు జరిగాయి. అది లారెన్స్ బిష్ణోయ్ చేయించిన పనేనని ముంబై పోలీసుల విచారణలో తేలింది. అదేకాకుండా ఆ తరువాత కూడా అనేక సందర్భాల్లో సల్మాన్ ఖాన్ను చంపేస్తామని లారెన్స్ హెచ్చరికలు జారీచేస్తూనే ఉన్నాడు.
గతేడాది సల్మాన్ ఖాన్ సన్నిహిత మిత్రుడు, ఎన్సీపీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖి హత్య జరిగింది. లారెన్స్ గ్యాంగ్ లోని ముఠా సభ్యులే సిద్ధిఖిని హత్య చేశారు. సిద్ధిఖిని చంపడానికి కారణం కూడా ఆయన సల్మాన్తో సాన్నిహిత్యంగా ఉండటమేననే ముంబై పోలీసులు అనుమానించారు. సిద్ధిఖి హత్యతో తన సత్తా ఏంటో సల్మాన్ ఖాన్కు చెప్పాలనే ఆలోచనతోనే లారెన్స్ ఈ హత్య చేయించినట్లు విచారణలో బయటికొచ్చింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్ తుఫాన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఎగిరిపోయేనా ?
IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ రోజు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగే మ్యాచ్లో చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2025లో ఈ మ్యాచ్ గురువారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది.
గత ఏడాది ఫైనలిస్ట్ SRH తమ తొలి మ్యాచ్లోనే రాజస్థాన్ రాయల్స్ (RR)ను 44 పరుగుల తేడాతో ఓడించి, ఐపీఎల్ రెండో అత్యధిక జట్టు స్కోరు (286/6) రికార్డును సాధించింది. ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత, ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.