OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే

కంటెంట్ బాగుండాలే కానీ బడ్జెట్తో సంబంధం లేదని నిరూపించాయి ఎన్నో సినిమాలు. చిన్న సినిమాలుగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. అలాంటి జాబితాలోకే వస్తుంది లేటెస్ట్ హిట్ మూవీ కోర్ట్. తక్కువ బడ్జెట్లో ఇంట్రెస్టింగ్ కథనంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ సిసినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.?
చంద్రశేఖర్ అలియాస్ చందు (హర్ష్ రోషన్) ఒక మధ్యతరగతి యువకుడు. ఇంటర్ ఫెయిల్ అయినా, జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో చిన్నచిన్న పనులు చేస్తూ గడిపే కుర్రాడు. ఓ ఇంట్లో వాచ్మెన్గా పనిచేసే అతని తండ్రి, అదే ఇంట్లో ఇంటర్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి)తో చందుకు స్నేహం ఏర్పడుతుంది. ఇది ప్రేమగా మారే సరికి, జాబిలి ఇంట్లో విషయం తెలిసిపోతుంది.
ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. కుటుంబ పరువు, గౌరవం పేరుతో నడిచే జాబిలి బంధువు మంగపతి (శివాజీ) ఒక్కసారిగా మండిపడతాడు. ఎలాంటి విచారణ లేకుండా, పోక్సో చట్టంతో పాటు ఇతర కఠినమైన సెక్షన్ల కింద చందుపై కేసు వేస్తాడు. చందు జీవితాన్ని ఒక్కసారిగా చీకటి గుండా నెట్టేసే ఆ ఘట్టం నుంచే అసలు డ్రామా మొదలవుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో పేరు మోసిన న్యాయవాది మోహన్ రావు (సాయికుమార్) వద్ద జూనియర్ లాయర్గా పనిచేస్తున్న సూర్యతేజ అలియాస్ తేజ (ప్రియదర్శి) ఆ కేసును తీసుకుంటాడు.
నిజం కోసం పోరాడే అతని న్యాయపోరాటం చందు జీవితాన్ని ఎలా మార్చింది? న్యాయం గెలిచిందా లేక చట్టపు లోపాలు మరోసారి ఓ అమాయకుడిని చీకటి బాట పట్టించాయా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధమవ్వండి.