నేడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను శుక్రవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసే అవకాశముంది. చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు ధృవీకరించాయి. వంద శాతం రిజర్వేషన్లు గిరిజనులున్న గ్రామ పంచాయితీను ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఉన్న విధంగానే 59.85 శాతం కోటాను అమలు చేస్తామని.. అందు కోసం కోర్టును ఒప్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 12 వేల715 గ్రామ పంచాయితీలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే పంచాయితీలకు రిజర్వేషన్లను నేడు ఖరారు చేయనుంది. ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందిన 45 రోజుల్లోగా అంటే మార్చి 31లోగా ఎన్నికలు నిర్వహించనుంది. గడవు ముగిసిన పంచాయితీలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామస్థాయి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.