ఏసీబీ చేతికి చిక్కిన నలుగురు అధికారులు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అధికారుల్లో నలుగురు సోమవారం ఏసీబీ చేతికి చిక్కారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అధికారుల్లో నలుగురు సోమవారం ఏసీబీ చేతికి చిక్కారు. ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు గతంలో కర్నూలులోని భూపాల్ కాంప్లెక్స్లో ఉన్న చంద్రకాంత్ చిట్ఫండ్స్ నిర్వాహకులు గోపాల్రెడ్డి, ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు. సీసీఎస్ సీఐ రామయ్య నాయుడికి ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు.
ఆదినారాయణరెడ్డిపై రౌడీషీటు తెరవకుండా ఉండేందుకు, అరెస్టు చేయకుండా ఉండేందుకు గతంలో సీఐ రూ.లక్ష తీసుకున్నారు. దాంతో సరిపెట్టుకోక మళ్లీ లంచం డిమాండ్ చేస్తున్నాడని గోపాల్రెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.ఈ క్రమంలోనే స్థానిక వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్లో న్యాయవాది చంద్రశేఖర్రెడ్డి సీఐ తరఫున లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నాగభూషణం పట్టుకుని అరెస్ట్ చేసారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
అలాగే విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం వియ్యంపేట ఐసీడీఎస్ సీడీపీవో పోతల మణెమ్మ లంచం తీసుకుంటూ దొరికారు. అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయలు, కిరాణా సరుకులు అందించే ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఆదారి సురేష్కుమార్, ఎస్.రమణబాబులను లంచం డిమాండ్ చేసారు. దీంతో దిక్కు తోచని పరిస్థితిలో వారు డబ్బులను ఇచ్చి ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ సీడీపీవో మణెమ్మ ఆదేశాలతో రూ.85 వేలు లంచం తీసుకుని టేబుల్ సొరుగులో పెట్టబోయాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు ఆమెను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మంగళవారం వారిని విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఆయన చెప్పారు.