Komatireddy Venkat Reddy: రహదారులు, భవనాల నిర్మాణంపై మంత్రి వెంకట్ రెడ్డి సమీక్ష
Komatireddy Venkat Reddy: ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే మా లక్ష్యం
Komatireddy Venkat Reddy: ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులు, భవన నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో మంత్రి వెంకట్ రెడ్డి విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లతో పాటు అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.
ఒకరిద్దరు అధికారుల వల్ల ప్రజల జీవితాలు ప్రభావితమైతే, చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై బ్లాక్ స్పాట్లు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, ఈ మార్గాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఏళ్లుగా నత్తనడకన సాగడంపై అధికారులను ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్ ఇన్సాల్వెన్సీ పనుల్లో ఆలస్యం జరుగుతోందని అధికారులు తెలపగా... ప్రజలు రోజూ ఇబ్బంది పడుతుంటే ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.