CM Revanth Reddy: అధికారులెవరూ సెలవులు పెట్టొద్దు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సీఎం విజ్ఞప్తి..
అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంవో ఆఫీస్కు పంపాలని చెప్పారు.
Heavy Rains: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అలర్టయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, రాజనర్సింహ, తుమ్మల, జూపల్లితో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని, పెట్టినవారు వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే.. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంవో ఆఫీస్కు పంపాలని చెప్పారు. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సాయం కోసం చర్యలు చేపట్టాలన్న సీఎం.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ.. సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటకు రావొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. 24 గంటలు అలర్ట్గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు భాగం కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్రెడ్డి.