CA Final Exams: సీఏ విద్యార్థులకు బిగ్ న్యూస్.. పరీక్షలపై కీలక ప్రకటన.. ఏడాదికి మూడు సార్లు

CA Final Exams: చార్టెర్డ్ అకౌంటెంట్ పరీక్షలకు సంబంధించి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఏడాదికి మూడు సార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సీఎ ఫైనల్ ఎగ్జామ్స్ ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది మార్చిలో సీఏ ఇంటర్ , ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఐసీఏఐ..తాజాగా సీఐ ఫైనల్ పరీక్షలను కూడా అదే తరహాలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్దతులకనుగుణంగా విద్యార్థులకు గొప్ప అవకాశాలను అందించేందుకు సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఏడాదిలో మూడుసార్లు నిర్వహించేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా నిర్ణయంతో సీఏ ఫైనల్, ఇంటర్, ఫౌండేషన్ పరీక్షలు ఏడాదిలో మూడు సార్లు జరుగుతాయని పేర్కొంది. ఈ పరీక్షలు జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో జరుగుతాయని తెలిపింది. దీంతో విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.