Andhra Pradesh: రేపు చివరి విడత పంచాయతీ ఎన్నికలు

Andhra Pradesh: 13 జిల్లాల్లోని 161 మండలాల్లో * 3,299 సర్పంచ్‌, 33,435 వార్డులకు పోలింగ్

Update: 2021-02-20 02:53 GMT

Representational Image

Andhra Pradesh: ఏపీలో ఎన్నో అవరోధాల మధ్య ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. రేపు రాష్ట్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 13 జిల్లాల్లోని 161 మండలాల్లో 3వేల 299 సర్పంచ్‌, 33వేల 435 వార్డులకు పోలింగ్‌ జరగనుండగా ఇప్పటికే 553 సర్పంచ్‌, 10వేల 921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 2వేల 744 సర్పంచ్‌ స్థానాలకు 7వేల 475 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 22వేల 422 వార్డులకు 49వేల 83 మంది బరిలో నిలిచారు.

ఇక.. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటిగంటన్నరకే పోలింగ్‌ ముగియనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. అటు.. ఎన్నికల విధుల్లో మొత్తం 50 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. సమస్యాత్మక ప్రదేశాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటర్లు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు బూత్‌ అధికారులు.

మరోవైపు ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 దశల ఎన్నికలు, కౌంటింగ్‌పై పలుచోట్ల ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌, వీడియో గ్రఫీ తప్పకుండా ఏర్పాటు చేయాలని నిమ్మగడ్డ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని కౌంటింగ్ ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశాలు జారీ చేశారు ఎస్‌ఈసీ. ఇప్పటివరకు మూడు విడతల ఎన్నికలు సజావుగా జరగాయని, తుది దశ పంచాయతీ ఎన్నికలు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు.

ఇక వీడియో రికార్డింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర జనరేటర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు నిమ్మగడ్డ సూచించారు. అలాగే కౌట్టింగ్ కేంద్రాల్లోకి ఇతరులను అనుమతించవద్దన్న నిమ్మగడ్డ గెలుపు, ఓటములకు పది ఓట్ల తేడా ఉంటేనే రీకౌటింగ్ చేపట్టాలని ఆదేశించారు. కౌంటింగ్ సందర్భంగా సమాచారం లీకవుకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Tags:    

Similar News