RK Roja: రుషికొండపై రోజా ట్వీట్.. వెన్ను చూపేది లేదు వెనకడుగు వేసేది లేదు..
RK Roja: రుషికొండపై నిర్మించిన భవనాలపై తీవ్ర వివాదం రేగుతోంది.. కూటమి-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
RK Roja: రుషికొండపై నిర్మించిన భవనాలపై తీవ్ర వివాదం రేగుతోంది.. కూటమి-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అయితే, ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. విశాఖపట్టణంలోని రుషికొండ పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా..? అంటూ ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న...తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా..? అంటూ ప్రశ్నించారు.
వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా..? అంటూ ట్వీట్ చేశారు. ఇక, మా పార్టీ అధినేత వైఎస్ జగన్పైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు… వెనకడుగు వేసేది లేదు..!! జై జగన్ అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.