తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియెట్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం జరగనుంది. ముందుగా ఇంటర్ సెకండియర్ జవాబు పత్రాలను దిద్ది, ఆ తర్వాత ఫస్టియర్ పేపర్లు వాల్యుయేషన్ చేయనున్నారు.
కరోనా నేపథ్యంలో మూల్యాంకన కేంద్రాలను 12 నుంచి 33కి పెంచారు. మొత్తం 9.50లక్షల మంది విద్యార్థులకు చెందిన 55 లక్షల జవాబు పత్రాలను 15వేల మంది అధ్యాపకులు మూల్యాంకనం చేయనున్నారు. జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశముంది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటర్బోర్డు మూల్యాంకన కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని కేంద్రాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతో పాటు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.