Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు దుర్మరణం

Encounter
Chhattisgarh: ఛత్తీస్ గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో జిల్లాల నుంచి సంయుక్త బలగాలు ఉదయం నుంచి అడవుల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
ఘటనాస్థలంలో మూడు డెడ్ బాడీలతోపాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. మార్చి 20న భారీ ఎన్ కౌంటర్లు జరిగిన విషయం తెలిసిందే. బీజాపూర్ కాంకెర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చోటుచేసుకున్న పలు ఎన్ కౌంటర్లలో 90 మంది నక్సల్స్ మరణించినట్లు తెలుస్తోంది.