Scissors In Abdomen: కడుపునొప్పి అని వెళ్తే.. పొట్టలో కత్తెర పెట్టి కుట్లేశారు

Update: 2024-10-19 14:15 GMT

Scissors In Abdomen: కడుపులో నొప్పితో బాధపడుతూ హాస్పిటల్‌కి వెళ్లిన ఒక 45 ఏళ్ల మహిళకు డాక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఎక్స్‌రే తీసి చూసి ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు తెలిపారు. ఒకరకంగా ఇది పేషెంట్‌కి, ఆమె కుటుంబసభ్యులకే కాదు.. ఆ హాస్పిటల్ డాక్టర్లకు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని ఆస్పత్రులలో డాక్టర్లు సర్జరీ చేసే క్రమంలో సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఎలా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది.

సిక్కింలో 12 ఏళ్ల క్రితం అపెండిసైటిస్ నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ వైద్యం కోసం గ్యాంగ్‌టక్‌లోని సర్ తుటోబ్ న్యామ్‌గల్ మెమోరియల్ హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆమెకు అపెండిసైటిస్ సర్జరీ చేశారు. డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చినా ఆమెకు కడుపులో నొప్పి తగ్గలేదు. ఆ తరువాత కడుపు నొప్పికి పరిష్కారం కోసం ఆమె ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో చేసేదేం లేక ఇటీవల, అంటే అక్టోబర్ 8న ఆమె మరోసారి తనకు అప్పట్లో అపెండిసైటిస్ సర్జరీ చేసిన ఎస్టీఎన్ఎం హాస్పిటల్‌కి వెళ్లారు.

ఎస్టీఎన్ఎం హాస్పిటల్లో ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూసి షాకయ్యారు. ఆమె పొత్తికడుపులో కత్తెర ఉన్నట్లు వారికి స్పష్టంగా కనిపించింది. అది కూడా 2012 లో ఆమెకు ఆ సర్జరీ చేసింది అదే హాస్పిటల్లో అని తెలిసి మరింత షాకయ్యారు. వెంటనే ఆ మహిళకు సర్జరీ చేసి ఆ కత్తెరను తొలగించారు. ప్రస్తుతం ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఈ విషయం కాస్త బయటికి పొక్కడంతో ఆస్పత్రి బయట బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానిక ప్రజా సంఘాలు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. దీంతో సిక్కిం వైద్య ఆరోగ్య శాఖ ఎస్టీఎన్ఎం హాస్పిటల్ నిర్వాకంపై విచారణకు ఆదేశించింది. 

Tags:    

Similar News