Nani: దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం.. నాని కీలక వ్యాఖ్యలు
మలయాళ ఇండస్ట్రీలో మహిళల పై జరుగుతోన్న లైంగిక వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికను రెడీ చేసింది.
కోలక్తాలో జరిగిన వైద్యురాలి హత్యాచర, హత్య సంఘటన దేశవ్యాప్తంగా ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత పాశవికంగా దాడి చేయడం పట్ల దేశమంతా ఖండించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. దేశంలో మహిళలపై జరుగుతోన్న దాడుల చూసి భయపడే పరిస్థితి వచ్చిందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మలయాళ ఇండస్ట్రీలో జరిగిన వ్యవహారం కూడా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
మలయాళ ఇండస్ట్రీలో మహిళల పై జరుగుతోన్న లైంగిక వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికను రెడీ చేసింది. ఆ నివేదికలో దిగ్బ్రాంతికి గురి చేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాల్లో నటించాలంటే హీరోయిన్లు కాంప్రమైజ్ కావాల్సిందే అంటూ నివేదికలో వెల్లడయ్యాయి. దీంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మహిళలకు దక్కుతోన్న భద్రత ఇదేనా అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఇదే విషయమై హీరో నాని సైతం స్పందించారు. ఈ రెండు సంఘటనలపై స్పందించిన నాని.. ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతాలో జరిగిన సంఘటన తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. ఇక హేమ కమిటీ విడుదల చేసిన నివేదిక చూసి షాకయ్యానన్నారు. ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక వేధింపులు చూస్తుంటే మనం చాలా దారుణమైన పరిస్థితుల్లో బతుకున్నామనిపిస్తోంది అని అన్నారు. ఇక కోల్కతాలో మెడికల్ స్టూడెంట్ పై జరిగిన సంఘటన తనను బాగా కలచివేసిందని, గతంలో జరిగిన నిర్భయ ఘటన బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని చెప్పుకొచ్చారు.
ఫోన్ను స్క్రోల్ చేయాలంటే భయపడుతున్నానని, మితిమీరిన సోషల్ మీడియా వాడటం ఎప్పటికైనా ప్రమాదమేనని నాని అభిప్రాయపడ్డారు. ఆడవాళ్ళ పై జరుగుతోన్న గురించి విన్నప్పుడల్లా వాటినుంచి త్వరగా బయటకు రాలేకపోతున్నానని.. 20 ఏళ్ల క్రితం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవన్నారు. అప్పటి రోజుల్లో ఆడవాళ్లకు రక్షణ ఉండేది. అప్పటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.