ఎంపీ అభ్యర్థులపై వైసీపీ కసరత్తు ముమ్మరం...7 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ అధిష్టానం
వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ ఎంపి స్థానాలు దక్కించుకోవాలని ఏపీలో ప్రధాన ప్రతిపక్షం పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గెలుపు గుఱ్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని అదినేత జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం కొత్తవారిని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంగబలంతో పాటు అర్ధబలం ఉన్న వారే ఈ సారి ఎంపి అభ్యర్ధులుగా ఉండాలని పిక్స్ అయిన జగన్ అందుకోసం కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఏపిలో ఎన్నికల హీట్ మెదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే అభ్యర్థులను నిర్ణయిస్తామన్న ప్రకటనతో ప్రతిపక్ష వైసీపీ కూడా కసరత్తు ప్రారంభించింది. ఒక పక్క ఎమ్మెల్యే అభ్యర్ధుల కసరత్తు చేస్తూనే మరోపక్క పార్టమెంట్ స్టానాలకు అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో పడింది. ముఖ్యంగా పార్టమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అభ్యర్ధుల కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు జగన్.
మెత్తం 25 స్టానాలకు గానూ ఇప్పటివరకు కేవలం ఏడు స్టానాలకే ఎంపి అభ్యర్ధులు ఖరారయ్యారు. వీరిలో కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మితున్ రెడ్డి, తిరుపతి నుంచి వరప్రసాద్, నెల్లూరు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలు నుంచి వైవి సుబ్బారెడ్డి, విశాఖ నుంచి ఎంవీవీ సత్యనారాయణ, ఏలూరు నుంచి కోటగిరి శ్రీధర్, అమలాపురం నుంచి చింతా చంద్రావతి పేర్లు దాదాపు ఖరారు అయినట్లుగా చెబుతున్నారు. వీటిలో ఒంగోలు, కడప స్థానాల్లో మార్పులు ఉంటాయనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. ఇక మిగిలిన స్థానాల్లో కొత్త వారినే నిలిపేందుకు జగన్ నిర్ణయించారని తెలుస్తోంది. అర్ధబలం, అంగబలంతో పాటు వివాద రహితులకు మాత్రమే టికెట్లు ఇవ్వనున్నారు. ముఖ్యంగా రాజకీయాలకు దూరంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, రిటైర్డ్ ఐఏఎస్, పోలీసు అధికారల కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా పార్టీలో సీనియర్ లుగా ఉన్న కొంతమందిని పార్లమెంట్ కు పంపాలని జగన్ యోచిస్తున్నట్లు పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరిలో బోత్స సత్యనారాయణ, దర్మాన ప్రసాద్ రావు వంటి సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నుండి బోత్స, శ్రీకాకుళం నుండి దర్మానను బరిలో నిలపాలనేది అధినేత అలోచనగా తెలుస్తోంది. ఇక వీరితో పాటు జగన్ కుటంబం సభ్యుల్లో ఒకరిని ఎంపిగా పంపించాలనే అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ సోదరి షర్మిల ఎంపీగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఎంపి స్టానాలు గెలవాలని వైసీపి యోచిస్తుంది. ఇందుకోసం బలమైన అబ్యర్ధుల కోసం కసరత్తు చేస్తున్నారు.