కోనసీమ జనసేనలో కొత్త ఉత్సాహం...పవన్‌ను ప్రసన్నం చేసుకుంటున్న ఆశావాహులు

Update: 2018-11-26 04:58 GMT

జనసేన అధినేత ప్రజాపోరాట యాత్ర కోనసీమలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్ర పూర్తి చేసిన పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టారు. నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. భారీ సభల నిర్వాహణకు పవన్ అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. కోనసీమలో పవన్ ప్రజాపోరాట యాత్రలో పాల్గొనేందుకు జనసేన అభిమానులు పోటీ పడుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకంటే ముందే ఈ ప్రాంతంలో జనసేన తరపున పోటీ చేసే తొలి అభ్యర్ధిని ప్రకటించడంతో పవన్ కల్యాణ్ అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. జనసేన తరపున పోటీకి ఆసక్తి చూపుతున్న పవన్ కల్యాణ్ అభిమానులు ప్రజాపోరాట యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. 

నాలుగు రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలోనే పర్యటించనున్న పవన్ కల్యాణ్ ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో అభిమానులతో సమావేశం కానున్నారు. పవన్ పర్యటనతో ఆయా నియోజకవర్గాల్లో ఆయన అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్ధులను ఎంపిక చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజోలులో అభ్యర్ధి పేరు అధికారికంగా ప్రకటించకపోయినా రాపాక వరప్రసాద్ ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. ప్రజాపోరాటయాత్రలో వేర్వేరు పార్టీలకు చెందిన వారు జనసేనలో చేరుతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజోలులో కీలక పాత్ర పోషిస్తున్న అల్లూరి కృష్ణంరాజు జనసేనకు చేయూతనిచ్చే అవకాశాలున్నాయని  భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పట్ల అభిమానులు చూపుతున్న ఆదరణతో పవన్ కల్యాణ్ ఈ ప్రాంతంపై మరింత ఫోకస్ పెట్టినట్లుగా చర్చించుకుంటున్నారు.  

Similar News