మోడీ తెచ్చిన నీళ్లు, మట్టి వాపస్ ఇచ్చే స్కిట్

Update: 2018-03-07 09:58 GMT

హోదా ఇవ్వకుండా ప్యాకేజీ మాటెత్తకుండా దోబూచులాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్నమైన పద్ధతిలో నిరసన తెలిపారు. భుజాన కావడి మోస్తూ పార్లమెంట్ కు హాజరైన శివప్రసాద్ అమరావతికి మోడీ వచ్చినప్పుడు తీసుకొచ్చిన మట్టిని, నీటిని వాపస్ ఇచ్చేందుకు మోడీ కోసం వెదుకుతున్నట్టు చిన్నపాటి స్కిట్  ప్రదర్శించారు. 

టీడీపీ ఎంపీ శివప్రసాద్ మోస్తున్న ఈ కావడి కుండల్లో ఒకదాంట్లో మట్టి, మరో దాంట్లో నీళ్లున్నాయని మనం భావించాలి. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి హాజరయ్యారు. వస్తూ వస్తూ ఆయన వెంట పార్లమెంట్ ఆవరణలోని మట్టిని, యమునా నది నీటిని రెండు కుండల్లో పవిత్రంగా ప్యాక్ చేసి తీసుకొచ్చారు. అంతేకాదు ఢిల్లీని తలపించేలా రాజధాని నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

మోడీ అమరావతికి వచ్చి మూడేళ్లు దాటింది. హోదా ఇస్తామన్న మాటలు వట్టి మాటలని తేలిపోయాయి. ప్రత్యేక ప్యాకేజీ కూడా అటకెక్కింది. ఇక కేంద్రం నుంచి అందుతున్న సహకారం ఏముందంటూ ఏపీ నేతల్లో, ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. వారి ఆగ్రహాన్ని ప్రతిఫలింపజేస్తూ.. టీడీపీ ఎంపీ శివప్రసాద్.. మోడీ తీసుకొచ్చిన మట్టిని, నీళ్లను ఆయనకే వాపస్ ఇచ్చేందుకంటూ... పార్లమెంట్ లో ఇలా చిన్నపాటి స్కిట్ ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
 

Similar News