తెలుగుదేశం పార్టీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ తీర్పును వెలువరించింది. 2014 ఎన్నికల సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ లో వ్యక్తిగత విషయాలను దాచి పెట్టారంటూ వైసీపీ తరపున పోటీ చేసిన తిప్పేస్వామి 2014 జూన్ లో కోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలోని మడికెరి జిల్లా మన్నంపేట పోలీస్ స్టేషన్ లో ఈరన్నపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ విషయాన్ని అఫిడవిట్ లో ఈరన్న పేర్కొనలేదని తిప్పేస్వామి ఆధారాలను సమర్పించారు. ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న విషయాన్ని కూడా దాచి పెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో వాద, ప్రతివాదనలను విన్న కోర్టు చివరకు ఈరన్నఎన్నిక చెల్లదంటూ తీర్పును వెలువరించింది.