కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కంభంపాటి నాగశ్రీపవన్ వినూత్న ఆలోచనతో పేదలు, సామాన్యుల కోసం ఖర్చు లేకుండా ప్రయాణించే ఆటోమేటిక్ చార్జి సైకిల్ను రూపొందించాడు. కంచికచర్ల సమీపంలోని దేవినేని వెంకటరమణ, హిమశేఖర్ మిక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.కళాశాల మెకానికల్ యాజమాన్యం, అధ్యాపక బృందం, ఏపీ స్కిల్ డవలప్మెంట్ సహకారంతో ఈ వినూత్న సైకిల్ను రూపొందించినట్లు నాగశ్రీపవన్ తెలియజేశాడు.
ఏపీ స్కిల్ డవలప్మెంట్ ద్వారా నాగశ్రీపవన్కు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. నాగశ్రీపన్ రూపొందించిన ఆటోమేటిక్ చార్జి సైకిల్ గురించి వివరించటానికి ఈ నెల 4 నుంచి 16వ తేదీ మధ్యలో సైకిల్తో సహా రావాలని నాగశ్రీపవన్కు యూనివర్సిటీ పిలుపునిచ్చింది. దీంతో పవన్ శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు, బంధువుల వీడ్కోలు నడుమ అమెరికా పయనమయ్యాడు. తమ గ్రామానికి చెందిన యువకుడు ఓ ప్రత్యేక పరికరం తయారు చేయటం, దానిని ప్రదర్శించేందుకు అమెరికా వెళుతుండటంపై గ్రామస్తులు, కళాశాల యాజమాన్యం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.