అమాయకురాలిని హత్య చేసిన దుండగుడికి మరణశిక్షే సరైందని ముంబై హైకోర్ట్ స్పష్టం చేసింది. సంచలనం సృష్టించిన తెలుగు టెకీ అనూహ్య హత్య కేసులో నిందితుడు చంద్రభాన్ సనన్ను దోషిగా తేల్చుతూ ఉరిశిక్ష విధించింది. గతంలో మహిళా ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగమ్మాయి అనూహ్య మర్డర్ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు చంద్రభాను సనాప్ను దోషిగా తేల్చింది. అతడికి మరణశిక్ష విధించింది. అంతేకాదు దేశంలో మహిళలపై హింస పెరుగుతుందని ఇలాంటి వారికి ఉరిశిక్ష సరైందేనని గతంలో మహిళా ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించింది.
కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ఎస్తేర్ అనూహ్య మంబైలోని అంధేరీలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. 2014 జనవరి 4 న విజయవాడ నుంచి లోక్మాన్యతిలక్ ఎక్స్ప్రెస్లో ముంబైకి బయల్దేరి వెళ్లింది. ఆరోజు అర్ధరాత్రి వరకు అనూహ్య తన తండ్రితో ఫోన్లో మాట్లాడింది. దిగిన తర్వాత మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఇక అప్పటి నుంచి ఆమె జాడ తెలియలేదు. ఆమె నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జనవరి 16 న కుంజూర్మార్గ్ దగ్గర్లోని నిర్మాణుష్య ప్రాంతంలో సగం కాలిన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆనవాళ్లను బట్టి అది తమ బిడ్డదే అని అనూహ్య తల్లిదండ్రులు నిర్ధారించారు.
దీంతో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్లోని సీసీ టీవీ ఫూటేజ్ను పరిశీలించిన తర్వాత చంద్రభాను సనన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు తెల్లవారుజామున స్టేషన్కు చేరుకున్న చంద్రభాను అనూహ్యతో ట్యాక్సీ డ్రైవర్గా పరిచయం చేసుకున్నాడు. అంధేరిలో తన హాస్టల్కు కేవలం 300 రూపాయలకే అక్కడికి చేరుస్తానంటూ నమ్మించాడు. అయితే ట్యాక్సీ కనిపించకపోవడంతో అనూహ్య అనుమానించింది. దీంతో ఆమెను బైక్పై బలవంతంగా ఎక్కించుకున్న చంద్రభాను కార్వేనగర్ దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన దుండగుడు అనూహ్య ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు.
కేసు విచారణ చేపట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఎల్టీటీ రైల్వేస్టేషన్, ఆయా పరిసరాల్లో ఉన్న 36 సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి తొమ్మిది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. కార్వేలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చిన చంద్రభాన్ను అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువు కావడంతో ముంబయిలోని మహిళా ప్రత్యేక న్యాయస్థానం చంద్రభాన్ను దోషిగా నిర్థరించి 2015 అక్టోబర్లో చంద్రబానుకు ఉరిశిక్ష విధించింది. తీర్పుపై ముంబై హైకోర్టును సంప్రదించగా ముంబై హైకోర్టు తీర్పుపై అనూహ్య తండ్రి హర్షం వ్యక్తం చేశారు. తన బిడ్డ తిరిగిరాకున్నా న్యాయం జరిగిందన్న సంతృప్తి ఉందన్నారు. న్యాయం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని మరోసారి నిరూపితం అయ్యిందని ఇలాంటి వారికి మరణశిక్ష సరైందే అని అంటున్నారు అనూహ్య బంధువులు.