జాతీయ మీడియాతో జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అన్న పవన్ ఇప్పుడెలా మాట మార్చారని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి అవిశ్వాసానికి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ రాష్ట్రంలో ఏం చేస్తున్నాడని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నిలదీశారు.
పవన్ పరిణితితో మాట్లాడుతున్నారా?.. ఎవరైనా రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్నారా?
జాతీయ మీడియాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పందించారు. హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్న వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలని అన్నారు. వేరేవారు ఆడించే నాటకంలో పవన్ భాగస్వామి అవుతున్నట్టు కనబడుతోందని అభిప్రాయపడ్డారు. పవన్ లాంటి వ్యక్తుల అవసరం రాష్ట్రానికి లేదన్నారు. అలాంటి వారితో రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన ఎందుకు తెచ్చారో ఇప్పుడు స్పష్టత వస్తోందని మంత్రి అన్నారు. కేసీఆర్ కూడా భాజపాకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నట్టు కనబడుతోందని అభిప్రాయపడ్డారు.