నరాలు తెగే ఉత్కంఠను రోమాలు నిక్కబొడుచుకునే ఉత్సుకతను కలిగించే రేసింగ్ క్రీడలను ఇప్పటి వరకూ మనం టీవీల్లోనూ, సినిమాల్లోనే చూసుంటాం. క్షణక్షణానికి ఒళ్లు గగుర్పాటును కలిగించే ఇటువంటి క్రీడలను ఇప్పుడు మన రాష్ట్రంలోనే ప్రత్యక్షంగా తిలకించే అవకాశం వచ్చింది. క్రీడా ప్రేమికులతోపాటు సాధారణ వీక్షకులనూ ఉర్రూతలూగించే ఎఫ్1హెచ్2ఓ పవర్బోట్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు విజయవాడలోని కృష్ణా నది వేదికయ్యింది. పోటీల్లో డ్రైవర్లందరకూ ఈ రేసు కీలకంగా మారడంతో పోటీ రసవత్తరంగా జరగనుంది. ఈ బోటు క్రీడలను ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు.
ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో ఇప్పటివరకూ తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు గతేడాది ఛాంపియన్గా నిలిచిన ఫిలిప్ ప్రస్తుతం నాలుగోస్థానంలో ఉన్నాడు. అతడు టాప్-3లోకి వెళ్లాలంటే అమరావతిలో జరుగుతున్న పోటీ కీలకంగా మారింది. మరోవైపు టీం అమరావతి బోట్ డ్రైవర్గా ఉన్న జోనస్ అండర్సన్, రెండో డ్రైవర్ ఎరిక్ ఎడిన్లో ఎవరో ఒకరు టాప్-5లోకి చేరాలంటే ఈ పోటీయే వారికి చావోరేవుగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అమరావతిలో రేసు రంజుగా జరగనుంది. దీంతో పోటీల్లో పాల్గొంటున్న 19మంది డ్రైవర్లు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న 9 బృందాలు, నిర్వాహకులు ఉత్కంఠంగా ఉన్నారు.
ఎఫ్1హెచ్2ఓ-2018 ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలను ఏడు రేసులుగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటికే పోర్చుగల్, లండన్, ఫ్రాన్స్, చైనాలో మొత్తం నాలుగు రేసులు ముగిశాయి. అయిదో రేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేటి నుంచి ప్రారంభంకానుంది. తర్వాత డిసెంబరులో 6-8 అబుదాబిలో, అదే నెలలో 13-15 షార్జాలో చివరిగా ఫైనల్ రేసు జరగనుంది. అయితే, ప్రతీ రేసులోనూ మొదటి 10 స్థానాల్లో నిలిచిన వారికి పాయింట్లు ఇస్తారు. సంవత్సరంలో జరిగే ఏడు రేసుల్లో వారు సాధించే మొత్తం పాయింట్ల ఆధారంగా టాప్లో నిలిచిన వారు ప్రపంచ ఛాంపియన్గా నిలుస్తారు.