ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబునాయుడు.. ఎన్టీఆర్ను ఒక్కసారి కాదు.. రెండుసార్లు చీట్ చేశారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ను చీట్ చేసిన వారి నుంచి మనం ఏం ఆశించగలమని ప్రశ్నించారు.
ఇవాళ ఏపీలో అధికారంలో ఉన్నవారు గతంలో ఎన్టీఆర్ను మోసం చేశారని..ఇప్పుడు తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు మోడీ. అధికారాన్ని కాపాడుకునేందుకే రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ ప్రభుత్వం తాకట్టు పెడతోందని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి నిజమైన ప్రతీక ఎన్టీ రామారావు అని, అయితే ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చిన వ్యక్తి తెలుగు ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రధాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ను రాజకీయాల్లో పైకి తీసుకు వచ్చేందుకు ఏపీకి నష్టం చేకూరుస్తున్నారని మోడీ ఆరోపించారు. 2019లో ప్రధాని పదవి నుంచి మోడీని దింపేస్తానని… ఇతరులను నిలబెడతానని చెప్పడం ద్వారా ఎలా తెలుగు గౌరవం నిలబడుతుందని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లోని ఐదు లోకసభ నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.