AP News: నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

AP News: ఉ.11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం

Update: 2024-06-12 04:20 GMT

AP News: నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

AP News: మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటల 27 నిమిషాలకు సీఎంగా నాలుగోసారి ఆయన ప్రమాణం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. కార్యక్రమం జరగనున్న కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 20 ఎకరాల ప్రాంగణంలో 3 అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.

అతిథులు, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వేదిక అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కాగా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు 50 వేల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని సిద్ధం చేశారు.

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఇప్పటికే చాలా మంది ప్రముఖలు విజయవాడ చేరుకున్నారు. నారా, నందమూరి, మెగా ఫ్యామిలీల సభ్యులు మంగళవారం రాత్రే విజయవాడ చేరుకున్నారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులు, వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి విదేశీ, జాతీయస్థాయి అతిథులు రానున్నారు. మరోవైపు భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో... సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రజలందరికీ సభావేదికపై దృశ్యాలు కనిపించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేశారు.

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పెద్ద సంఖ్యలో జనాలు హాజరవనున్న నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా.. విజయవాడకు 3 వేల మందిని పంపించారు. గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, కేసరవల్లి సభా ప్రాంగణం, వెలుపల 7 వేల మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు. 60 మందికిపైగా ఐపీఎస్‌లు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News