Revanth Reddy: ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Revanth Reddy: కేంద్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాతో సీఎం భేటీ
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర్ర ప్రయోజనాల కోసం.. కేంద్రమంత్రులతో వరుస భేటీ అవుతున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు తెలంగాణలో ఉన్నాయని.. కేంద్ర మంత్రి మాండవీయకు రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లోని స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈత కొలనులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్, ఫుట్బాల్ గ్రౌండ్స్, స్కేటింగ్ ట్రాక్స్, వాటర్ స్పోర్ట్స్, ఇతర క్రీడలకు వసతులు ఉన్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. భవిష్యత్లో ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని కేంద్ర మంత్రి మాండవీయకు విజ్ఞప్తి చేశారు. 2025, జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇక తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో.. క్రీడా నైపుణ్యాల వెలికి తీసుకేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మాండవీయకు తెలిపారు. త్వరలోనే నిర్మించబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు.. రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద విడుదల చేసే నిధుల మొత్తాన్ని పెంచాలని కోరారు.