Poonam Kaur: త్రివిక్రమ్ను కూడా ప్రశ్నించాలి.. పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
Poonam Kaur: జానీ మాస్టర్ వ్యవహారంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Poonam Kaur: జానీ మాస్టర్ వ్యవహారంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఓ లేడీ డ్యాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తనను జానీ మాస్టర్ పలుసార్లు బలవంతం చేశాడని, బయటకు చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడంటూ సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో ఆమె ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు జానీ మాస్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జనసేన పార్టీలో ఉన్న జానీ మార్టసర్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆదేశించారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ వ్యవహారంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇదే విషయమై నటి పూనమ్ కౌర్ సైతం స్పందించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నిందితుడు షేక్ జానీ ని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం, విలువ ఇవ్వండి’ అని ఎక్స్లో పోస్ట్ చేసింది.
ఇంతటితో ఆగకుండా మరో సంచలన పోస్ట్ చేసింది పూనమ్. జానీ మాస్టర్ వ్యహారంలో స్పందించిన సినీ పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను సైతం ప్రశ్నించాలని ఆమె కోరింది. గతంలో తాను త్రివిక్రమ్పై ఫిర్యాదు చేసిన విషయాన్ని పూనమ్ కౌర్ ఈ సందర్భంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. గతంలో తనపై వేధింపులు జరిగిన నేపథ్యంలో సినీపెద్దలకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, ఎవరూ సహకరించలేదని చెప్పుకొచ్చింది. రాజకీయంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ట్వీట్లో పేర్కొన్నది. త్రివిక్రమ్తో పాటు ఓ ప్రముఖ హీరో తనను లైంగింకంగా వేధించారంటూ గతంలో పూనమ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పూనమ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.