Russian strike on Ukraine: రష్యా దుర్మార్గం.. 21మంది హతం.. ఆ ప్రాంతంపై భీకర దాడులు!
Russian strike on Ukraine: మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్ను అమెరికా మధ్యవర్తిత్వంతో తీసుకువచ్చిన ఒప్పందం ఉల్లంఘించిందని ఆరోపిస్తోంది.

Russian strike on Ukraine: రష్యా దుర్మార్గం.. 21మంది హతం.. ఆ ప్రాంతంపై భీకర దాడులు!
Russian strike on Ukraine: ఉక్రెయిన్లోని ఉత్తర భాగంలో ఉన్న సుమీ నగరంపై రష్యా బాలిస్టిక్ మిస్సైల్తో జరిపిన దాడిలో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 83 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను ఉక్రెయిన్ అధికారులు అత్యంత దారుణమైన దాడిగా అభివర్ణిస్తున్నారు.
సుమీ నగరంలోని రహదారులు, బస్సులు, కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శవాలు రోడ్డుపై పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. దాడి జరిగిన సమయం ప్రజలు చర్చులకు వెళ్లే సమయంగా ఉండటం దాన్ని మరింత దారుణంగా మార్చింది. ఈ ఘటనపై అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యా కేవలం అమాయకుల ప్రాణాలే కాదు, మానవతా విలువల్ని కూడా నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ఇంటీరియర్ మంత్రి ఈ దాడిని బహిరంగంగా ఖండించారు. ప్రజలు సాధారణంగా జీవితాన్ని గడిపే ప్రాంతాలపై టార్గెట్ చేసి ఈ దాడిని చేయడం ఉద్దేశపూర్వకమని ఆయన చెప్పారు. దీన్ని చర్చి పండుగ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా అమలుపర్చిన దుర్మార్గ చర్యగా ఆయన అభివర్ణించారు.
ఈ దాడి ముందు కొన్ని రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కోను సందర్శించిన విషయం చర్చకు తెరతీసింది. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరిపారు. దీనికి నేపథ్యంగా ఈ దాడి జరగడం అనుమానాలకు తావిస్తుంది. జెలెన్స్కీ తన ప్రతిస్పందనలో అమెరికా మరియు యూరప్ దేశాలను రష్యాపై మరింత బలమైన ఆంక్షలు విధించాలని కోరారు. తీవ్ర ఒత్తిడితోనే ఈ యుద్ధాన్ని ఆపడం సాధ్యమవుతుందని, లేదంటే రష్యా అలాంటి ఉగ్రవాద చర్యలతో యుద్ధాన్ని సాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు.
ఇక మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్ను అమెరికా మధ్యవర్తిత్వంతో తీసుకువచ్చిన ఒప్పందం ఉల్లంఘించిందని ఆరోపిస్తోంది. ఇంధన స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేశారని రష్యా చెబుతోంది. గత నెలలో ఇరు దేశాలు ఒకదానికొకటి ఇంధన కేంద్రాలపై దాడులు చేయకూడదని అంగీకరించాయి. అయితే రెండు దేశాలూ ఇప్పుడు ఒకరిపై మరొకరు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఆరోపణలు చేస్తున్నారు.