Ajay Jadeja: అజయ్ జడేజా ఇకపై మామూలు వ్యక్తి కాదు.. రాజ వంశానికి వారసుడు

Update: 2024-10-12 13:18 GMT

Ajay Jadeja Is The Next Jam Saheb of Nawanagar: ఇన్నాళ్లూ అజయ్ జడేజా అంటే చాలామందికి ఒక టీమిండియా మాజీ క్రికెటర్‌గానే తెలుసు. కానీ ఇకపై అజయ్ జడేజా అంటే గుజరాత్‌లోని జామ్ నగర్ రాజవంశానికి వారసుడు. జామ్ నగర్‌నే గతంలో నవా నగర్ అని కూడా పిలిచే వారు. స్వాతంత్య్రానికి ముందు జామ్ నగర్‌ని రాజవంశీయులు పాలించే వారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో వారి వంశానికి వారసులను ప్రకటించే ఆనవాయితీ ఉంది. అందులో భాగంగానే తాజాగా అజయ్ జడేజాను తమ వంశానికి వారసుడిగా ప్రకటిస్తూ నవా నగర్ మహారాజ జామ్ సాహెబ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటివరకు జామ్ నగర్ ప్రాంతానికి శత్రుసల్య సిన్హాహీ దిగ్విజయ్ సిన్హాజీ ఆ రాజవంశానికి వారసుడిగా ఉన్నారు. తాజాగా ఆయనే అజయ్ జడేజాను తమ వారసుడిగా ప్రకటించారు. అజయ్ జడేజా తన ప్రతిపాదనకు అంగీకరించినందుకు ఆయన ఆనందం వ్యక్తంచేశారు. అంతేకాదు.. జామ్ నగర్ ప్రాంతానికి సేవ చేసే బాధ్యతలను అజయ్ జడేజా తీసుకోవడం అనేది నిజంగా ఆ ప్రాంత ప్రజలకు వరం అవుతుందని శత్రుసల్య సిన్హాహీ దిగ్విజయ్ సిన్హాజీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

అజయ్ జడేజా తండ్రికి శత్రుసల్య సిన్హాహీ దిగ్విజయ్ సిన్హాజీ కజిన్ బ్రదర్ అవుతారు. 1939 లో జన్మించిన ఆయన, 1966 ఫిబ్రవరి 3న ఆ రాజ వంశానికి వారసుడు అయ్యారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఆయనే ఆ స్థానంలో కొనసాగుతున్నారు.

అజయ్ జడేజా నేపథ్యం

అజయ్ జడేజా నేపథ్యం విషయానికొస్తే.. 1971, ఫిబ్రవరి 1న జన్మించిన అజయ్ జడేజా రాజ వంశం నేపథ్యం నుండే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. 1992 నుండి 2000 మధ్య కాలంలో 15 టెస్ట్ మ్యాచ్‌లు, 196 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. అజయ్ జడేజా కుటుంబానికి బలమైన క్రికెట్ నేపథ్యం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న పాపులర్ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ టోర్నీలు అజయ్ జడేజాకు చెందిన ఇద్దరు సమీప బంధువుల పేర్లపై నుండి వచ్చినవే. వారిలో ఒకరు కే రంజిత్ సిన్హాజీ (రంజి ట్రోఫీ) కాగా మరొకరు దులీప్ సిన్హాజీగా (దులిప్ ట్రోఫీ) చెబుతారు.

ఒక వివాదం కారణంగా అజయ్ జడేజా కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడింది. క్రికెట్ కెరీర్ తరువాత బాలీవుడ్ సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ తరువాత మళ్లీ క్రికెట్ కామెంటేటర్ అవతారమెత్తాడు. డాన్స్ రియాలిటీ షోలోనూ హోస్టుల్లో ఒకరిగా పాల్గొన్నాడు. ఇటీవల జరిగిన ఐసిసి పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆప్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుకు మెంటార్‌గా పనిచేశారు. ఇదంతా గతం కాగా ఇకపై అజయ్ జడేజా జామ్ నగర్ రాజవంశానికి అధికారిక వారసుడు. 

Tags:    

Similar News